జవాను కాదు..., యువకులే లైంగికంగా వేధించారు: కాశ్మీర్ యువతి (వీడియో)
శ్రీనగర్: ఓ బాలిక పైన భద్రతా బలగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ శ్రీనగర్లో చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అక్కడి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ విషయమైన జరిగిన కాల్పుల్లో ఇప్పటి దాకా ముగ్గురు చనిపోయారు.
అయితే, హింద్వారాకు చెందిన ఓ బాలిక మాత్రం భద్రతా బలగాలు తనను లైంగికంగా వేధించారన్న ఆరోపణలను కొట్టి పారేసింది. ఆమె ఓ వీడియో ద్వారా ఈ సందేశాన్ని అందించింది. జవాను తన పైన లైంగిక వేధింపులకు పాల్పడలేదని, తనను స్థానిక యువకులే వేధించారని బాలిక వీడియో ద్వారా చెప్పింది.
ఆ వీడియోలో జరిగిన సంఘటనను ఆమె వివరించింది. తన సంచిని స్నేహితురాలికి ఇచ్చి టాయిలెట్ వెళ్లానని, బయటకు వస్తుండగా స్థానిక యువకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, కాసేపటికి మరికొందరు యువకులు వచ్చి వేధించారని చెప్పింది. వారే తనను లైంగికంగా వేధించారని, జవాను కాదని చెప్పారు.