నివురుగప్పిన నిప్పులా కాశ్మీర్.. భద్రత కట్టుదిట్టం.. 3 నెలలకు సరిపడా ఆహారపదార్థాల నిల్వ
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పలువురు కాశ్మీరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంపై పలువురు నిరసనలకు సిద్ధమయ్యారు. అయితే భారీగా భద్రతా బలగాలు మోహరించడంతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో లోయలో హింస చెలరేగే అవకాశముందన్న భాయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తాజా నిర్ణయం కారణంగా ముస్లింలు మెజార్టీ గుర్తింపును కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు స్థానికులు మాత్రం ప్రాంతీయ పార్టీల కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాశ్మీరీ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో మోడీ సర్కారు తమను నిర్బంధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ దుస్థితి జమ్మూ కాశ్మీర్లోని రాజకీయ పార్టీలే కారణమని, ఆర్టికల్ 370రద్దుతో తమ గుర్తింపును కోల్పోయినట్లైందని అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు కాశ్మీరీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్యతో దశాబ్దాలుగా కాశ్మీర్లో కొనసాగుతున్న అశాంతి, హింస సమసిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. కాశ్మీరి పండిట్లను స్వస్థలాలకు రప్పించేందుకు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ అసలే మాత్రం అడ్డంకి కాదని అన్నారు. రాష్ట్రంలోో నెలకొన్న అశాంతి వారు తిరిగి రావడానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాశ్మీర్ లోయలో ఉండే ప్రజలకు మూడు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు అధికారులు ప్రకటించారు. బియ్యం, గోధుమలు, మాంసం, గుడ్లు, ఇంధనం తదితర వస్తువుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా సెక్యూరిటీ టైట్ చేశారు. స్థానికులు సంయమనం పాటించాలని అధికారులు కోరారు. ఇప్పటికే వేలాది మంది భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ శ్రీనగర్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.