కాశ్మీర్ను భారత్ ఆక్రమించింది: జెఎన్యూ ప్రొఫెసర్ వివాదాస్పదం
న్యూఢిల్లీ: కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. ప్రతి భారతీయుడు దీనిని తప్పక అంగీకరిస్తారు. కానీ న్యూఢిల్లీలోని జెఎన్యూకు ప్రొఫెసర్ నివేదిత మీనన్ మాత్రం కొత్త భాష్యం చెబుతున్నారు. 'భారతదేశం కాశ్మీర్ను అన్యాయంగా ఆక్రమించిందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరిస్తారు' అంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆమె గత నెల 22వ తేదీన జెఎన్యూలో ప్రసంగించినట్టుగా ఉండే వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కాశ్మీర్తో పాటు... మణిపూర్, నాగాలాండ్ను కూడా భారతదేశం బలవంతంగా కలిపేసుకుందని వ్యాఖ్యలు చేశారు.
అందులో ఆమె.. 'టైమ్, న్యూస్వీక్ లాంటి విదేశీ ప్రచురణల్లో భారత మ్యాప్లో కాశ్మీర్ మరో రకంగా ఉంటుంది. ఆ మ్యాగజైన్ల కాపీలు ఎప్పుడూ ఇక్కడ వివాదాస్పం అవుతూనే ఉంటాయి. ప్రపంచమంతా కాశ్మీర్పై భారత్ దురాక్రమణ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. కాశ్మీర్లోయలో స్వతంత్రం కోసం చేసే ఆజాదీ నినాదాలు సమర్థనీయమేనని మనం ఆలోచించాలి'' అన్నారు.
ఈ వీడియో ఇప్పుడు విస్తృత ప్రచారం కావడంతో ప్రొఫెసర్ నివేదిత మీనన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఆమె క్షమాపణ చెప్పాలని.. అలాంటి వ్యాఖ్యలను ఖండిస్తూ జేఎన్యుఎస్యు తీర్మానం చేయాలని కోరింది.
బీజేపీ విద్యార్ధి విభాగం ఏబీవీపీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తాను వీడియోలో చెప్పిన మాటలు ఏమీ జాతి వ్యతిరేకంగా లేవని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 9న జెఎన్యూలో జరిగిన ఓ సభలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో జెఎన్యూ విద్యార్ధి విభాగం నాయుకుడు కన్నయ్య కుమార్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసే జేఎన్యు విద్యార్థులను, ప్రొఫెసర్ను కాల్చిపారేసి ఈ అధ్యాయాన్ని ముగించాలని బీజేపీ జునాగఢ్ ఐటీ విభాగం కన్వీనర్ సంజయ్ రాథో డ్ ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ కొద్దిసేపటికే ఆ ట్వీట్ను అతడు తొలగించాడు.