కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే, పాక్కి మద్దతు ఇవ్వం: తేల్చేసిన తాలిబన్
కాబూల్: కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, ఆ దేశ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థగా పేరున్న తాలిబన్.. భారతదేశం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
పాకిస్థాన్ నేతృత్వంలో కాశ్మీర్లో జిహాద్కు తాలిబన్ రంగంలోకి దిగుతుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్(తాలిబన్) మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ మేరకు స్పందించారు.
ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ తాము తలదూర్చబోమని షాహీన్ స్పష్టం చేశారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ విషయంలో తాము పాకిస్థాన్కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
కాగా, కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు భారతదేశంతో స్నేహం చేసేది లేదంటూ తాలిబన్ మీడియా ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, భారత్ కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు ఫేక్ అని తేలింది. తాలిబన్కు ఈ పోస్టులతో సంబంధం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాలిబన్ సంస్థ స్పందించి.. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.