కాశ్మీర్ లో మరో భారీ ఉగ్రదాడికి కుట్ర ..నిఘా వర్గాల హెచ్చరిక
భారతదేశం ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నుండి ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ భారతీయులు ఈ ఉగ్రదాడి పై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. చిన్నారుల వద్ద నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ప్రతీకారం తీర్చుకోవాలి అంటున్నారు. ఇదిలా ఉంటే మరోమారు భద్రతా బలగాల టార్గెట్ గా భారీ ఉగ్రదాడికి జైషే మహమ్మద్ ప్లాన్ చేసిన వార్త ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది.
పుల్వామా విషాదం నుండి కోలుకోక ముందే మరో దాడి కుట్ర .. నిఘా వర్గాల హెచ్చరిక
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో పెను విషాదం నింపిన ఈ ఘటన తరువాత కూడా పుల్వామాలో భయానకమైన వాతావరణమే ఉంది. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్ర దాడి కి సూత్రధారులను హతమార్చడంతో పాటుగా, భారతదేశం మరో మేజర్ ను, ముగ్గురు జవాన్లను కోల్పోయింది.ఇప్పటికీ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత సైన్యం సన్నద్ధమవుతోంది. అయితే ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలు కీలక విషయాన్ని బయటపెట్టాయి.
మారోసారి భారీ ఉగ్రదాడికి స్కెచ్ .. ఈసారి ఆత్మాహుతి దాడికి ఆకుపచ్చ స్కార్పియో
జైషే మహమ్మద్ సంస్థ మరోసారి భారీ ఉగ్రదాడికి ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కశ్మీర్ లో చౌకీబాల్ నుంచి తంగ్ధార్ వెళ్లే మార్గంలో భద్రతా బలగాలు లక్ష్యంగా రాబోయే రెండ్రోజుల్లో ఈ దాడి జరగొచ్చని తెలిపాయి. ఈ మేరకు తాము జైషే మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశాలను డీకోడ్ చేసినట్లు పేర్కొన్నాయి.మరో ఆత్మాహుతి దాడి కోసం ఉగ్రవాదులు ఆకుపచ్చ రంగు స్కార్పియో కారును సిద్ధం చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ఈ దాడిలో దాదాపు 500 కేజీల పేలుడు పదార్థాలను వాడనున్నట్లు చెప్పాయి.
ఇది ఆరంభమే .. 500 కిలోల భారీ బ్లాస్ట్ కు సిద్ధంగా ఉండండి అన్న జైషే మహమ్మద్ సందేశం డీకోడ్
'ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వారం కేవలం 200 కిలోల ఐఈడీ మాత్రమే ఉపయోగించాం. 500 కిలోల భారీ బ్లాస్ట్కు సిద్ధంగా ఉండండి. కశ్మీరీలపై సైన్యం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా.. భద్రతా బలగాలపై మరిన్ని దాడులు జరుగుతాయి అంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పోస్ట్ చేసిన సందేశ సారాంశం . ఇది కేవలం మనకు.. సైన్యానికి జరుగుతున్న యుద్ధం. రండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి' అని కశ్మీరీలకు జైషే పంపిన సందేశాన్ని డీకోడ్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ప్రస్తుతం కశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.