మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ హీట్: బీజేపీ ప్రచారాస్త్రం అదే.. మొదలు పెట్టేసిన అమిత్ షా!
ముంబై: కేంద్రంలో అధికారంలో కొనసాగుతోన్న భారతీయ జనతాపార్టీ.. ఇక మహారాష్ట్ర, హర్యానాల్లో పీఠాన్ని నిలుపుకోవడంపై దృష్టి సారించింది. వచ్చేనెల ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా బీజేపీయే అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాలకు పదును పెడుతోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన అంశాన్ని ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో.. బీజేపీ సుప్రిమో, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎన్నికల వేడిని రాజేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం వంటి అంశాలపై బీజేపీ దృష్టి సారించింది.
రాహుల్ బాబాకు అవగాహన తక్కువ..
ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకున్నారు. తనదైన శైలిలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్.. భారతావనిలో విలీనమైందని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్ప మరెవరూ తీసుకోలేరని అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి రావడం వల్లే అది సాధ్యపడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేదా? అని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని తాము రాజకీయంగా ఎంత మాత్రమూ భావించట్లేదని అంటూనే అమిత్ షా.. దానిపైనే తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయాలనే ఒకే ఒక్క ధ్యాస తప్ప.. దాని నుంచి రాజకీయపరమైన లబ్దిని పొందాలనుకునే ఆలోచన తమకు గానీ, తమ పార్టీ నాయకులకు గానీ ఎంత మాత్రమూ లేదని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు కోసం ప్రాణాలను పణంగా పెట్టాం..
ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తప్పు పట్టారు. `రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త. మొన్నీ మధ్యే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మేము.. మూడు తరాల నుంచీ రాజకీయాలు చేస్తున్నాం, రాజకీయాల్లోనే ఉన్నాం. దేశం గురించి, దేశం ఎదుర్కొనే సమస్యాత్మకమైన, సున్నితమైన సమస్యల గురించి ఎవరికి ఎక్కువ అవగాహన ఉంటుంది?.. జమ్మూ కాశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేయడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయించడానికి బీజేపీ నాయకులు తమ జీవితాలనే పణంగా పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముందు వాటి గురించి తెలుసుకో.. అంటూ చురకలు అంటించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం మాత్రమే కాకుండా.. పార్లమెంట్ మొట్టమొదటి సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రతిపాదించడం, దాన్ని ఆమోదించడం ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యపడిందని అన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమిత్ షా అన్నారు.
తమ హయాంలోనే మహారాష్ట్ర అభివృద్ధి
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రైతులు సహా అన్ని వర్గాల వారికీ మేలు కలిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయాన్ని అందుకోవడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ దేవేంద్ర ఫడణవిస్ ప్రభుత్వం అనేక ఘన విజయాలను ఈ అయిదేళ్ల కాలంలో నమోదు చేసిందని అమిత్ షా ప్రశంసించారు. ఈ సారి కూడా తమ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని నెరవేర్చి తీరుతామని అమిత్ షా అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేపట్టిందని ఆ పార్టీని గెలిపించాలో చెప్పగలరా? అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.