కశ్మీర్ పై సుప్రీంలో నేడు విచారణ.. ఉత్కంఠగా చూస్తున్న ప్రపంచ దేశాలు
Recommended Video
శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రత చర్యల్లో మునిగితేలుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్కు బీఎస్ఎఫ్ను పంపించడం గమనార్హం.
ఉత్కంఠ రేపుతున్న ఆర్టికల్ 35A
కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A ను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో సోమవారం (25.02.2019) నాడు విచారణ జరగనుంది. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత అనుకోని పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేలా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. దాదాపు 100 కంపెనీల పారా మిలిటరీ బలగాలను కశ్మీర్ కు తరలించింది.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా.. భద్రతా బలగాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రతా చర్యల్లో మునిగితేలుతున్నారు. జమాతే ఇస్లామీ జమ్ముకశ్మీర్ సంస్థ అధినేత అబ్ధుల్ హమీద్ ఫయాజ్ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 140 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే బలగాలను పంపినట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఇక్కడి రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు కేంద్రం తీరును తప్పుపడుతున్నాయి.
హై అలర్ట్
సుప్రీంకోర్టులో 35A ఆర్టికల్ విచారణ సందర్భంగా జమాతే ఇస్లామీకి చెందినవారితో పాటు వివిధ సంస్థలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనుకోని ఘటనలు జరగకుండా నివారించడానికే వీరిని ముందస్తుగా నిర్భందంలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాందు జమాతే సంస్థపై ఇంత కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి అంటున్నారు.
45 సీఆర్పీఎఫ్, 35 బీఎస్ఎఫ్, 10 ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, 10 సశస్త్ర సీమా బల్.. ఇలా వంద బలగాలను కశ్మీర్ కు పంపింది కేంద్రం. బీఎస్ఎఫ్ బలగాలను దాదాపు 14 ఏళ్ల తర్వాత కశ్మీర్ కు పంపింది. సుప్రీంకోర్టు విచారణ దరిమిలా కేంద్రం బలగాలను పంపించిందనే ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఖండించింది. ఎన్నికల్లో భాగంగానే బలగాలను పంపినట్లు కేంద్రం చెబుతోంది. శాంతిభద్రతల విధుల్లో మాత్రమే ఈ బలగాలు పాల్గొంటాయని ప్రకటించింది.
కేంద్రంపై నిరసన గళం
కేంద్రం చర్యలను నిరసిస్తూ కశ్మీర్ లో నిరసనల స్వరం పెరిగింది. వివిధ సంస్థలకు చెందినవారిని ముందస్తుగా నిర్భందించడాన్ని పలువురు ఖండిస్తున్నారు. వేర్పాటువాద సంస్థలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ జేఆర్ఎల్ ఆదివారం బందుకు పిలుపునిచ్చింది. జమాతే ఇస్లామీకి చెందినవారిని అరెస్ట్ చేయడంతో ఆ సంస్థ తీవ్రంగా తప్పుపట్టింది.
ముందస్తు అరెస్టులపై పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం అక్రమ నిర్భంధాలను కేంద్రం సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. వ్యక్తులను అక్రమంగా నిర్భందించినంత మాత్రాన.. వారి భావాలను ఏ మాత్రం అదుపుచేయలేరని విరుచుకుపడ్డారు. బలవంతపు చర్యలతో పరిస్థితి మెరుగుపడదని.. మరింత వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యానించారు హురియత్ కాన్ఫరెన్స్ అధినేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్.