కాశ్మీర్ పై పాకిస్తాన్-చైనా ఉమ్మడి కుట్ర ఫలిస్తుందా? ఐరాస భద్రతా మండలి భేటీపై ఉత్కంఠత
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి గుమ్మం తొక్కింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై మొదటి నుంచీ నిప్పులు చెరుగుతూ వస్తోన్న పొరుగు దేశం పాకిస్తాన్.. ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. ఆర్టికల 370 రద్దు వ్యవహారంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ సమావేశం గురువారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా తీసుకొచ్చిన ఒత్తిడి మేరకే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పాకిస్తాన్ తో దోస్తీ చేస్తూ.. భారత్ పై కత్తి కట్టిన చైనా ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రహస్య భేటీ..
భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీ రహస్యం (క్లోజ్డ్ డోర్స్) పద్ధతిన కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి పౌర సంబంధాల అధికారి బార్ట్లోమిజ్ వైబక్జ్ తెలిపారు. కొన్ని అరుదైన సందర్భాల్లోనే భద్రతా మండలి క్లోజ్డ్ డోర్స్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై పాకిస్తాన్ చేసిన విన్నపం మేరకు భద్రతా మండలి చాలాకాలం తరువాత క్లోజ్డ్ డోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుండటం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి, ఆమోదించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ కు వెన్నుదన్నుగా ఉంటోన్న చైనా
ఈ విషయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో పావులు కదిపింది. తమతో స్నేహం చేస్తోన్న చైనా దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది. ఆర్టికల్ 370 రద్దయిన కొద్దిరోజుల్లోనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చైనా వెళ్లారు. ఆ దేశ ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తరువాతే అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యే పరిస్థితి తలెత్తింది. ఐక్యరాజ్య సమితిలోని పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీ అధికారికంగా భారత్ పై ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ చేసిన ఫిర్యాదు పత్రాన్ని ఆయన ఆ దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడికి అందజేశారు. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితిలోని పోలండ్ రాయబారి జొవాన్నా వ్రొనెక్కా దృష్టికీ తీసుకెళ్లారు. ఆ తరువాతే భద్రతా మండలి సమావేశం కావాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది.