వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీ
ఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్. పుల్వామాలో గత గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కశ్మీర్లో నక్కి ఉన్న ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ వేట కొనసాగించింది. ఓచోట నక్కి ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. పుల్వామా దాడి జరిగిన 100 గంటల్లోపే కశ్మీర్లోయలో జైషే మహ్మద్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిందని వారి నాయకత్వం లేకుండా చేసిందని చెప్పారు జనరల్ కన్వల్ జీత్ సింగ్.
ఇదిలా ఉంటే ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా మరో నలుగురు జవాన్లు అమరులయ్యారు. మేజర్ వీఎస్ దోనదియాల్, హవాల్దర్ షియో రామ్, హరిసింగ్ మరియు అజయ్ కుమార్ అనే ఇద్దరు సిపాయిలు అమరులు అయ్యారు. ఈ ఘటనలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ కలాస్ కూడా మృతి చెందాడు. ఇలాంటి ఉగ్రవాదులను అనగదొక్కుతామని దిల్లాన్ చెప్పారు. కశ్మీర్ లోయలో ఎవరైనా తుపాకులు చేతపట్టుకుని తిరిగితే వెంటనే హతమారుస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో వినియోగించిన పేలుడు పదార్థాలపై ఉగ్రవాదులకు మంచి అవగాహన ఉందని చెప్పిన దిలాన్... విచారణ జరుగుతున్న నేపథ్యంలో దాడికి వినియోగించిన పేలుడు పదార్థాల గురించి ఎక్కువగా మాట్లాడలేనని వెల్లడించాడు.
కశ్మీర్ సమాజంలో తల్లికి ఎంతో బాధ్యత ఉంటుంది. ఎవరైతే ఉగ్రవాదులతో చేయి కలిపారో అలాంటి వారి తల్లులు ఒక్కసారి వారిని పిలిపించే ప్రయత్నం చేయాలని ఉగ్రవాదం వీడేలా చూడాలని జనరల్ ధిల్లాన్ విజ్ఞప్తిం చేశారు. తుపాకీతో కనిపించిన వారిని కాల్చేస్తామని వెంటనే తుపాకులు వీడి సరెండర్ అవ్వాలని వెల్లడించారు. తాము చేస్తున్న ఆపరేషన్పై ఫుల్ క్లారిటీతో ఉన్నామని.... ఎవరైనా కశ్మీర్ లోయలోకి చొరబడితే ప్రాణాలతో బయటకు వెళ్లడని హెచ్చరించారు. ఉగ్రదాడిలో పాకిస్తాన్, ఐఎస్ఐ హస్తం ఉందని పాకిస్తాన్ ఆర్మీకి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఓ బిడ్డలాంటిదని చెప్పారు.