టైగర్ మెమెన్ ను కలిశా: కాంగ్రెస్ ఎంఎల్ఏ
శ్రీనగర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మెమెన్ను పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో తాను కలిశానని కాశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుడు ఉస్మాన్ మజీద్ బాంబు పేల్చాడు.
శుక్రవారం ఉస్మాన్ మజీద్ శ్రీనగర్ లో మాట్లాడారు. ఉస్మాన్ మాజీ మిలిటెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ శాసన సభ్యుడిగా ఉన్నాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల తరువాత అదే సంవత్సరంలో టైగర్ మెమెన్ పాక్ అక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ లో ఉన్నాడని చెప్పాడు.
ఆ సందర్బంలో తమ కార్యాలయానికి టైగర్ మెమెన్ వచ్చేవాడని ఎంఎల్ఏ ఉస్మాన్ మజీద్ అన్నాడు. తాను రెండు మూడు సార్లు టైగర్ మెమెన్ ను కలిశానని స్పష్టం చేశాడు. బాబ్రీ మసీదు విధ్వంసం, తరువాత జరిగిన అల్లర్లకు ప్రతీకారంగా ముంబై బాంబు పేలుళ్లు సృష్టించామని టైగర్ మెమెన్ చెప్పాడని అన్నారు.
పేలుళ్లకు ప్లాన్ వేసి ఆయుధాలు సమకూర్చి కుట్రను పూర్తిగా అమలు చేసింది ఐఎస్ఐ అని టైగర్ మెమెన్ చెప్పాడని ఎంఎల్ఏ ఉస్మాన్ మజీద్ అన్నాడు. యాకూబ్ మెమెన్ లొంగిపోయిన తరువాత ఐఎస్ఐ తనను అంతం చేస్తుందని టైగర్ మెమెన్ భయపడ్డాడని ఉస్మాన్ మజీద్ చెప్పాడు.
అంతకు ముందు ఐఎస్ఐ ఇచ్చే గౌరవం తగ్గిపోయిందని, అనుమానంతో చూడటం మొదలు పెట్టిందని అందుకే టైగర్ మెమెన్ దుబాయ్ పారిపోయాడని ఉస్మాన్ మజీద్ చుప్పాడు. అయితే టైగర్ మెమెన్ లొంగిపోతాడనే అనుమానంతో ఐఎస్ఐ మళ్లి టైగెర్ మెమెన్ ను పాక్ రప్పించుకుందని ఉస్మాన్ మజీద్ వివరించాడు.