రాత్రి నుంచి ఫోన్లు పనిచేస్తాయి, సోమవారం స్కూళ్లు ఓపెన్, కశ్మీర్లో పరిస్థితి సద్దుమణిగిందన్న సీఎస్
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించడంతో సుందర కశ్మీరం నివురుగప్పిన నిప్పులా మారిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి సద్దుమణిగిందని ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. క్రమంగా నిబంధనలను సడలిస్తామని కాసేపటి క్రితం జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం మీడియాకు వివరించారు. ఇవాళ రాత్రి నుంచి ఫోన్లు పనిచేస్తాయని తెలిపారు.
పునరుద్ధరిస్తాం ..
ఫోన్లతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థను రిస్టోర్ చేస్తామని తెలిపారు సుబ్రమణ్యం. ఇవాళ రాత్రి వరకు ఫోన్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఫోన్లు పనిచేయడానికి కాస్త సమయం పడుతుందని వివరించారు. కశ్మీర్ విభజన తర్వాత ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో 40 వేల సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ వ్యాలీలో లష్కరే తోయిబా సంస్థను నిషేధం విధించారు. సోమవారం నుంచి పాఠశాలలు తెరుస్తామని పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా పాఠశాలలను పునరుద్ధరిస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం నుంచే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయని వివరించారు.
విడుదల చేస్తాం .. కానీ
మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముప్తీలను కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు. రోజువారీ పరిస్థితిని సమీక్షించి .. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కశ్మీర్ విభజన నుంచి ఇప్పటివరకు ఉగ్ర దాడులు జరగలేదన్నారు. ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పారు. ఇప్పటికీ మెడికల్, ఆహారం అందరికీ సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాటిలైట్ ద్వారా టీవీ ప్రసారాలు జరుగుతున్నాయని .. వార్త పత్రికలు ఇళ్లకు చేరుతున్నాయని చెప్పారు. రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
5 జిల్లాలే ..
జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 22 జిల్లాల్లో 12 జిల్లాల్లో పరిస్థితి బాగుందని చెప్పారు. మిగతా జిల్లాల్లో బలగాల మొహరించామని వివరించారు. వీటిలో ఐదు జిల్లాల్లో కొన్ని ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి .. ప్రజా రవాణా, ఫోన్లు, ఇతర వెసులుబాట్లను తిరిగి ఎప్పటిలాగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. కశ్మీర్ విభజనకు ముందే వ్యాలీలో 40 వేల బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కశ్మీర్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.