మోస్ట్ వాంటెడ్: కాశ్మీర్లోయలో వీరికోసం వేట కొనసాగిస్తున్న సైన్యం
జమ్మూకాశ్మీర్లో గత రెండు రోజులుగా పరిస్థితులు వేడెక్కిస్తున్నాయి. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ పొడగించేందుకు కేంద్రం ఒప్పుకోకపోవడం.. ఆ తర్వాత బీజేపీ పీడీపీకి మద్దతు ఉపసంహరించుకోవడం, రాష్ట్రం గవర్నర్ పాలన కిందకు రావడం వెనువెంటనే జరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉన్నందున అక్కడ మోహరించిన భద్రతాబలగాలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఉగ్రవాదులను, కాశ్మీర్లోయలో అలజడి సృష్టిస్తున్న అల్లరి మూకలను ఏరిపారేసేందుకు సైన్యం సిద్ధంగా ఉంది. అంతేకాదు సరిహద్దుల్లో పరిస్థితులను చక్కబెట్టేందుకు కూడా సైన్యం పావులు కదుపుతోంది.
గత కొన్ని నెలలుగా ఉగ్రవాదులను ఏరివేస్తూ వారి అధినాయకులను మట్టుబెట్టడం ద్వారా భారత సైన్యం విజయం సాధించింది. బుర్హాన్ వాణీతో మొదలైన ఈ ఎన్కౌంటర్లు ఉగ్రవాదుల్లో అగ్రనాయకులను హతమార్చడంలో సైన్యం సఫలమైంది. అయితే ఇంకా కొందరు ఉగ్రమూకలు లోయలో అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. అట్టివారిని మట్టుబెట్టేందుకు సైన్యం కూడా తనదైన పద్ధతిలో సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ 6మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కోసం సైన్యం వేట కొనసాగిస్తోంది. వారిని చేరుకునేందుకు కొంత కష్టమైనప్పటికీ భారత సైన్యం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.
కాశ్మీర్ను వణికిస్తున్న ఆ ఆరుగురు ఉగ్రవాదుల వివరాలు ఇలా ఉన్నాయి.
* రియాజ్ నైకూ: కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు. రియాజ్ నైకూ అలియాస్ జుబేర్ ఉల్ ఇస్లాం పుల్వామాలోని బేగ్పోరా ప్రాంతానికి చెందిన వాడు
* జకీర్ రషీద్ భట్: ఇతన్ని జకీర్ మూసా అని కూడా పిలుస్తారు. అన్సర్ అనే కొత్త ఉగ్రవాద సంస్థకు అధినేత. ఇతను కూడా ఏ++ కేటగిరీ కిందకు వస్తాడు. నూర్పొరా అవంతిపొరా ప్రాంతానికి చెందినవాడు
* జీనత్ ఉల్ ఇస్లాం: ఇతన్ని ఉస్మాన్ అని కూడా పిలుస్తారు. జీనత్ ఏ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా పరిగణిస్తారు. షోపియన్ ప్రాంతానికి చెందిన జీనత్.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఏరియా కమాండర్గా వ్యవహరిస్తున్నారు.
*డాక్టర్ సైఫుల్లా: ఇతన్ని అబు ముసైబ్ అని కూడా పిలుస్తారు. ఏ++ కేటగిరీకి చెందిన సైఫుల్లా శ్రీనగర్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్గా ఉన్నాడు. పుల్వామా లోని మాలంగ్పోరా ప్రాంతానికి చెందినవాడు.
* అల్తాఫ్ కచ్రూ: ఏ++ కేటగిరీకి చెందిన అల్తాఫ్ అలియాస్ మోయిన్ ఉల్ ఇస్లాం కుల్గామ్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
*నవీద్ జాట్: ప్రముఖ పత్రికా ఎడిటర్ షూజాత్ బుఖారిని హత్య చేసి వార్తల్లో నిలిచాడు. నవీద్ జాట్ అలియాస్ అబుహన్జాలా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు పనిచేస్తున్నాడు. ఏ++ కేటగిరీకి చెందిన హన్జాలా పాకిస్తాన్కు చెందినవాడు.