కశ్మీర్ అప్డేట్స్ : పార్టీల సమావేశానికి బ్రేక్.. హోటల్లో వద్దంటూ..!
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ అంశం హాట్ టాపిక్ అయింది. క్షణక్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కశ్మీర్ వాతావరణం మరింత హీటెక్కినట్లు కనిపిస్తోంది. కశ్మీర్కు అడిషనల్ ఫోర్స్ తరలింపుపై ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ రెండు పార్టీలతో పాటు ఇతర లోకల్ పార్టీలు ఎమర్జెన్సీ మీటింగ్కు సన్నద్ధమయ్యాయి.
ఆల్ పార్టీ మీటింగ్ పేరుతో అత్యవసర సమావేశం నిర్వహించేందుకు ఓ హోటల్ను ఎంచుకున్నారు నేతలు. అయితే ఈ సమావేశానికి పోలీసులు నో చెప్పడంతో సమావేశ స్థలాన్ని మార్చుకున్నారు. చివరకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నివాసంలో భేటీ కావాలని నిర్ణయించారు. ఆ క్రమంలో సాయంత్రం ఆమె ఇంట్లో సమావేశమై కశ్మీర్ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్ కల్లోలంపై కేంద్రం క్లారిటీ.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!
ఈ సందర్భంగా మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్టికల్ 35ఎ, 370లను తొలగిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ దేశ ప్రజలకు చెప్పడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశామన్నారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చారు. అదలావుంటే జమ్ముకశ్మీర్లో ఎప్పుడూ ఏం జరుగుతోందని స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. ఇక సరిహద్దు సమీపంలో నివసించే ప్రజలు బంకర్లకు తరలిపోతున్నారని చెప్పారు.
అదలావుంటే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో సూచన మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు అమర్నాథ యాత్రకు వచ్చే భక్తులకు ముప్పు పొంచి ఉందనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయినట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్లో తాజా పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.