ఐఎస్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఐదుగురిపై ఎన్ఐఏ ఛార్జీషీటు: హైదరాబాదీనే కీలకం
శ్రీనగర్/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)కు అనుబంధమైన ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)తో సంబంధాలున్న ఐదుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జీషీటు దాఖలు చేసింది. నిందితుల్లో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినర్ కూడా ఉండటం గమనార్హం.
ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా
ఢిల్లీ న్యాయస్థానంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఛార్జీషీటు సమర్పించినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఢిల్లీలో నివాసముంటున్న కాశ్మీర్కు చెందిన జహాన్జాయిబ్ సమీ(36), హీనా బషీర్(39) దంపతులతోపాటు హైదరాబాద్కు చెందిన అబ్దుల్లా బాసిత్(26), పుణెకు చెందిన సదియా అన్వర్ షేక్(20), నబీన్ సిద్ధికి ఖత్రి(27)లను అధికారులు నిందితులుగా పేర్కొన్నారు.
దేశంలో అల్లర్లు, పేలుళ్లకు యత్నించడమే వీరిపని..
ఉగ్రవాద సంస్థలతో కలిసి.. వివిధ మతాలవారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు పాల్పడటం, జనసమ్మర్థ ప్రదేశాల్లో పేలుళ్లకు పాల్పడటం వంటి లక్ష్యాలతో వీరు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాక, సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొని దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఐఎస్కు చెందిన ‘సావత్ అల్ హింద్(వాయిస్ ఆఫ్ ఇండియా)' మేగజైన్ ఫిబ్రవరి 2020 సంచికను వీరు ప్రచురించారు. ఈ క్రమంలో మార్చి 8న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది.
Recommended Video
ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలంగా హైదరాబాద్ అబ్దుల్ బాసిత్..
ఈ ఐదుగురు మహారాష్ట్రలో భారీ పేలుళ్లకు కూడా ప్రయత్నించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మొదట శ్రీనగర్కు చెందిన జహన్జాయిబ్, అతని భార్య హీనా బషీర్లను మార్చిలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతభారతదేశంలో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు కీలకంగా వ్వహరిస్తున్న హైదరాబాద్ కు చెందిన అబ్దుల్లా బాసిత్, పుణెకు చెందిన సదియా అన్వర్ షేక్(20), నబీన్ సిద్ధికి ఖత్రి(27)లను వరుసగా అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ అబూదాబి మాడ్యూల్ 2018 కేసులో ఇప్పటికే అబ్దుల్లా బాసిత్ తీహార్ జైలులో జూడీషియల్ కస్టడీలో ఉన్నాడని ఎన్ఐఏ అధికార ప్రతినిధి సోనియా నారంగ్ తెలిపారు.