అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడు
అతనో ఐఏఎస్ అధికారి.. ఎంతో కష్టపడి చదివి కలెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడటమే కాదు ఇష్టపడి చదివాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అయితే ఎంత ఇష్టంగా అయితే ఆ పదవి చేపట్టాడో.. అంతే కష్టంతో తన పదవికి రాజీనామా చేస్తున్నాడు. ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టమేంటి... ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది..?
2009లో సివిల్ సర్వీసెస్లో టాపర్
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షా ఫేసల్. ఇలా చెబితే ఆయన ఎవరో ఎవ్వరికీ గుర్తుకు రారు. కానీ ఆయన ఘనత గురించి చెబితే టక్కున గుర్తుపట్టేస్తారు. ఇంతకీ ఈయన ఎవరంటే... 2009 సివిల్ సర్వీసెస్ పరీక్షలో జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి. ఇక జమ్ముకశ్మీర్ నుంచి తొలి ర్యాంకు సాధించడంతో ఆయన ప్రతి రాజకీయ పార్టీ నేతలచే కొనియాడబడ్డాడు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తని రాజకీయనాయకుడంటూ ఎవరూ లేరు. అంతేకాదు షా ఫేసల్ యువతకు స్ఫూర్తి అని ప్రశంసించారు. అయితే ఫేసల్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతకుముందు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు.
ఉన్నత చదువుల కోసం హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్లిన ఫేసల్
ఐఏఎస్గా ఎంపిక అయిన తర్వాత ఫేసల్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా ప్రభుత్వం నియమించింది. స్వతహాగా వైద్యుడైన ఫేసల్ అంతకుముందు జమ్మూకశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్శిటీకి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఈ మధ్యే తాను చదువులను పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చారు.వచ్చిన వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కశ్మీర్లో జరుగుతున్న హత్యలకు నిరసనగా ఫేసల్ రాజీనామా
కశ్మీర్లో ప్రజలను అన్యాయంగా చంపడాన్ని ప్రశ్నించారు ఫేసల్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మరణాలపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కశ్మీరీల జీవితాలకంటే తన ఉద్యోగం ముఖ్యం కాదని చెప్పారు. ఇదంతా ఓ ట్వీట్ ద్వారా చెప్పారు. కుప్వారాలోని లోలబ్ లోయ నుంచి వచ్చిన ఫేసల్ దక్షిణాసియాకు సంబంధించి ఓ వివాదాస్పదమైన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. దక్షిణాసియాలో అత్యాచారాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. అదే సమయంలో దక్షిణాసియాను "రేపిస్తాన్"గా అభివర్ణించారు. ఫేసల్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలాంటి ట్వీట్లు పోస్టు చేయడం సరికాదని సీరియస్ అయ్యింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు ఫేసల్.
ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన ఫేసల్
తనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పంపిన ఆదేశాల కాపీని కూడా ట్విటర్లో పోస్టు చేశాడు ఫేసల్. ప్రభుత్వం తనకు రాసిన లవ్లెటర్గా పేర్కొన్నాడు. నిరంకుశత్వంతో విధులు నిర్వహించడం ప్రజాస్వామ్య దేశంలో తగదని చెబుతూ.. గ్రామీణ ప్రాంతంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ చెప్పుకొచ్చారు. అత్యాచారం అనేది ప్రభుత్వ విధానంలో భాగం కాదని అత్యాచారంపై విమర్శలు చేయడం ప్రభుత్వ విధానాలను విమర్శించడం అవుతుందని దానిపై చర్యలు కూడా ఉంటాయని ఫేసల్ ఎద్దేవా చేశారు. 2017లో కూడా ప్రభుత్వం ఉద్యోగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే మనస్సు, కళ్లు, నాలుక, కాళ్లు, చేతులు అన్నీ బానిసత్వానికి లొంగిపోతాయని వ్యాఖ్యలు చేశారు.