ఆ కారణంతో.. 'ఓయో'లో కశ్మీరీ విద్యార్థికి ఘోర అవమానం..? అసలేం జరిగింది..
ఢిల్లీ యూనివర్సిటీ లా ఫ్యాకల్టీ స్టూడెంట్ నౌమన్ రఫీక్కి నార్త్ ఢిల్లీలోని ఓ ఓయో హోటల్లో అవమానం జరిగింది. అతను కశ్మీరీ అన్న కారణంగా హోటల్లో అతనికి రూమ్ ఇచ్చేందుకు నిరాకరించారు. తన తండ్రి,సోదరి కోసం విజయనగర్లోని ఆశా రెసిడెన్సీలో ఓయో 49019 డబుల్ ఆక్యుపెన్సీ రూమ్ బుక్ చేసుకున్నట్టు నౌమన్ రఫీక్ తెలిపాడు. ఫిబ్రవరి 15-17 వరకు రూమ్ బుక్ చేసుకున్నట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 15) ఉదయం తాను ఆ హోటల్ వద్దకు వెళ్లగా.. కశ్మీరీ అన్న కారణంగా తనకు రూమ్ నిరారకరించారని ఆరోపించాడు.
ఇదీ జరిగింది..
హోటల్ రిసెప్షన్లోకి ఎంటర్ అయ్యాక.. తన ఐడీ కార్డు కూడా చూడకముందే.. ఎక్కడినుంచి వచ్చావని ఓయో సిబ్బంది ప్రశ్నించినట్టు రఫీక్ చెప్పాడు. జమ్మూకశ్మీర్ అని తాను బదులివ్వడంతో.. 'మా హోటల్లో పాకిస్తాన్,బంగ్లాదేశ్,జమ్మూకశ్మీర్ వాళ్లకు ప్రవేశం లేదు' అని చెప్పినట్టు వెల్లడించాడు. అంతేకాదు, ఇది ఓయో పాలసీ అని వారు చెప్పారని తెలిపాడు. ఓయో సిబ్బంది తీరుతో తాను షాక్ తిన్నానని.. దీంతో కంపెనీ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్ చూపించాలని పట్టుబట్టానని రఫీక్ చెప్పాడు. ఓయో యాప్లో కంపెనీ పాలసీ ఉంటుందని చెప్పిన సిబ్బంది.. ఇక తన నుంచి ఎటువంటి ప్రశ్నలను పట్టించుకోలేదని తెలిపాడు. జరిగిన ఘటన చాలా అవమానకరంగా ఉందని అన్నాడు. ఓయో హెల్ప్ లైన్కు కాల్ చేయగా.. తనకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పి.. మరో హోటల్లో బుకింగ్ని ఆఫర్ చేశారని తెలిపాడు.
హోటల్ మేనేజర్ ఏమన్నారు..
కశ్మీరీల పట్ల ఓయో ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అగస్టులోనూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్న కారణంతో పలు ఓయో హోటల్స్ కశ్మీరీలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. తాజా ఘటనపై సదరు ఓయో హోటల్ మేనేజర్ రాహుల్ గౌతమ్ మాట్లాడుతూ... జరిగిన దానికి ఢిల్లీ పోలీసులను వేలెత్తి చూపారు. తమ హోటల్ పోలీస్ గ్రౌండ్కు సమీపంలో ఉంటుందని.. దీంతో తరుచూ పోలీసులు తనిఖీలకు వస్తారని తెలిపారు. అలా ఇటీవల హోటల్లోకి వచ్చిన ఓ పోలీస్ అధికారి జమ్మూకశ్మీరీ,లడఖ్ నుంచి ఎవరు వచ్చినా అనుమతించవద్దని చెప్పాడన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో హోటల్లోకి వారిని అనుమతించడం మంచిది కాదని చెప్పాడన్నారు.
ఇటీవలే అది అమలులోకి వచ్చిందని..
తాము కశ్మీరీలకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని.. కేవలం పోలీసుల ఆదేశాలను పాటిస్తున్నామని ఓయో మేనేజర్ తెలిపారు. కశ్మీరీలకు ప్రవేశం లేదన్న విషయాన్ని పోర్టల్లో కూడా అప్డేట్ చేయాలని సిబ్బంది ఓయో యాజమాన్యానికి సమాచారం ఇచ్చారని.. కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది కుదరలేదని అన్నారు. నిజానికి ఈ పాలసీ జనవరి 21వ తేదీ నుంచే ఓయోలో అమలులోకి వచ్చిందని రిసెప్షనిస్ట్ బీఎస్ రానా తెలిపారు.
భిన్నంగా ఢిల్లీ పోలీసుల వాదన..
మరోవైపు ఢిల్లీ పోలీసుల వాదన మరోలా ఉంది. సీఏఏ లేద మరో కారణంతో కశ్మీరీలను అనుమతించవద్దని తాము ఏ హోటల్కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని.. సదరు ఓయో హోటల్కు సమీపంలోని ముఖర్జీ నగర్ పోలీస్ అధికారి కరన్ సింగ్ రానా తెలిపారు. హోటల్లో అనుమతికి కావాల్సింది కేవలం సరైన ఐడీ ప్రూఫ్ మాత్రమేనని చెప్పారు. రఫీక్ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించకపోవడం వల్లే అతన్ని హోటల్లోకి అనుమతించలేదన్నారు. అయితే రఫీక్ మాత్రం ఇది పచ్చి అబద్దం అన్నాడు. వాళ్లు కనీసం తనను ఐడీ ప్రూఫ్ కూడా అడగలేదని.. కేవలం ఎక్కడినుంచి వచ్చావని అడిగి.. రూమ్ ఇచ్చేందుకు నిరాకరించారని అన్నాడు.
విచారణ జరుపుతున్నామన్న ఓయో..
కస్టమర్ అసౌకర్యానికి కారణమైన తమ భాగస్వామ్య హోటల్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలపై విచారణ జరుపుతున్నామని ఓయో యాజమాన్యం తెలిపింది. తక్షణ చర్యల్లో భాగంగా ఆ హోటల్ భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది. వివక్షపూరిత చర్యలేవైనా ఓయో ప్రాథమిక సూత్రాలకు విరుద్దమని.. వాటిని తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది. కాగా,తనకు ఎదురైన వివక్షపై తాను న్యాయ పోరాటం చేస్తానని రఫీక్ చెబుతున్నాడు.