ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: బందీలం అయ్యాం: విమానంలో రాహుల్ వద్ద వాపోయిన కాశ్మీరీ మహిళ
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. శ్రీనగర్ నుంచి దేశ రాజధానికి విమానంలో ప్రయాణిస్తోన్న ఆయనను కాశ్మీర్ కు చెందిన తోటి మహిళా ప్రయాణికురాలు ఒకరు తన గోడును వెల్లబోసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత నెలకొన్న పరిస్థితులను ఆ కాశ్మీరీ మహిళ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. తమ సొంత నివాసంలో తాము చాన్నాళ్ల పాటు బందీలు కావాల్సి వచ్చిందని వివరించారు.
కాశ్మీర్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, సామాన్యుల జీవనం దుర్భరమైందని ఆమె రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధురాలు రాధికా ఖేరా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిాంది. జమ్మూ కాశ్మీర్ కు వెళ్లడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీని శ్రీనగర్ విమానాశ్రయంలోనే అక్కడి భద్రతా అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి బయట అడుగు పెట్టనివ్వలేదు. ఫలితంగా- ఆయన శ్రీనగర్ వెళ్లకుండానే న్యూఢిల్లీకి తిరుగుముఖం పట్టారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
कश्मीर का दर्द सुनिए... pic.twitter.com/FRyg1Chifg
— Radhika Khera (@Radhika_Khera) August 24, 2019
విమానంలో కిటికీ వైపు ఉన్న సీటు వద్ద కూర్చున్న రాహుల్ గాంధీతో ఆ కాశ్మీరీ మహిళ ఆవేశంగా మాట్లాడటం ఈ వీడియోలో రికార్డయ్యింది. తమ పిల్లలు సొంత ఇంట్లోనే బందీలు అయ్యారని, అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. తన సోదరుడు హృద్రోగంతో బాధపడుతున్నారని, పదిరోజులుగా డాక్టర్ ను కూడా ఇంటికి రానివ్వట్లేదని ఆమె అన్నారు. తమను కాపాడే వారి కోసం ఎదురు చూస్తున్నామని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ వెంట ఉన్న పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ తదితరులు ఆమె చెబుతోన్న విషయాన్ని శ్రద్ధగా వినడం కనిపించింది.