పుల్వామా ఉగ్రదాడిలో వారిని దోషులను చేయొద్దు: ఆ పని ఆ ముస్లింలది కాదు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడిలో అసలు దోషులు ఎవరో తేలిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కార్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ దాడిని అడ్డు పెట్టుకుని అమాయకులైన కాశ్మీరీలు, కాశ్మీరీ ముస్లింలను వేధించ వద్దని ఆయన కోరారు. ఈ ఘటనను అడ్డు పెట్టుకుని కొన్ని శక్తులు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తమ ఆయుధంగా వాడుకోవడానికి కొంతమంది స్థానికులను తప్పుపట్టే అవకాశం ఉందని చెప్పారు.
అమర జవాన్ల పార్థివ దేహాలకు భుజం పట్టిన రాజ్ నాథ్ సింగ్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన లేదా చదువుకుంటున్న కాశ్మీరీలు, కాశ్మీర్ కు చెందిన ముస్లింలపై ఆయా ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని ఒమర్ అబ్దుల్లా హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్న కాశ్మీరీ విద్యార్థులు, కాశ్మీరీ ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకునేలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే స్పందించాలని, తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
పుల్వామా ఉగ్రవాదుల దాడి తరువాత దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన కాశ్మీరు ప్రజల భద్రతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. రాష్ట్ర బలగాలు, భద్రతా సిబ్బంది దృష్టిని మరల్చడానికి జమ్మూ లేదా, రాష్ర్టంలోని ఇతర ప్రాంతాల్లో మత కల్లోలాలు చెలరేగే అవకాశం ఉందని కూడా ఆయన అనుమానించారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులు చేసిన వారిని ఉగ్రవాదులుగానే చూడాలని, వారికి మతాన్ని అంటగట్టరాదని చెప్పారు.
జమ్మూలో ప్రస్తుతం అత్యంత సున్నిత వాతావరణం నెలకొందని, ఎప్పుడు, ఏమి జరుగుతుందనేదీ తెలియరావట్లేదని అన్నారు. జమ్మూలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసు అధికారులను సంప్రదిస్తున్నానని చెప్పారు. జమ్మూలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు బెటాలియన్ల సైన్యాన్ని మోహరింపజేయాలని తాను ఇదివరకే సైన్యాన్ని కోరానని అన్నారు. దీనిపై ఆయన శుక్రవారం వరుసగా ట్వీట్లను సంధించారు.