ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు- ద్వితీయ శ్రేణి పౌరులుగా కంటే చైనా పాలనే బెటర్...
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ, కశ్మీర్ను మూడు ముక్కలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం అక్కడి పౌరులకు ఇప్పటికీ రక్షణ కల్పించలేకపోతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తీవ్రవాదాన్ని అరికట్టలేకపోయిందని, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని, ఇక్కడి పౌరులకు సరైన విద్య కానీ, వైద్యం కానీ అందడం లేదని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కశ్మీర్ వీధుల్లో బలగాలను వెనక్కి తీసుకుంటే ఇక్కడి ప్రజలు తమ నిరసన ఏంటో చూపిస్తారని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్ ప్రజలు భారత భూభాగంలో ఉన్నట్లు భావించడం లేదని, ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నారని పేర్కొన్నారు. దీని కంటే చైనా పాలనలో ఉంటే బెటరని వారు భావిస్తున్నట్లు ఓ వెబ్సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో నేషనల్ కాన్ఫరెన్స్ ఛీఫ్ తెలిపారు. కేంద్రం చర్యలతో ఇక్కడి ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని, ఇక వారు ఎప్పటికీ కేంద్రాన్ని నమ్మబోరని ఫరూక్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.
Recommended Video
జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు 72 గంటల ముందు మోడీ తనతో సమావేశమయ్యారని, దీంతో పాటు ఆర్టికల్ 35ఏను కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారని అబ్దుల్లా గుర్తు చేశారు. కానీ ప్రధాని మోడీ తన మాట నిలబెట్టుకోలేదన్నారు. దీనిపై తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.