ఉగ్రవాదంపై పోరు: మోడీతో ఏంజెలా మెర్కెల్ భేటీ, కాశ్మీర్పై జర్మనీ ఛాన్సలర్
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, జర్మనీ ద్వైపాక్షిక సహకారంతో పరస్పరం ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్కు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది.
గౌరవ వందన స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 11 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతరిక్షం, పౌర విమానయానం, సముద్రపు సాంకేతికత, వైద్యం, విద్య తదితర రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగాయి.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. 2022 నాటికి నవభారత నిర్మాణ ప్రణాళికకు జర్మనీ సాంకేతిక నైపుణ్యాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఇరు దేశాల సహకారం కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రక్షణ కారిడార్లలో రక్షణ సంబంధ ఉత్పత్తుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జర్మనీని కోరారు.
ఈ మొబిలిటి, స్మార్ట్ సిటీలు, నదుల శుద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సహకారానికి ఉన్న అవకాశాలపైనా పరస్పరం సహకరించుకోవాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఏంజెలా మెర్కెల్ మాట్లాడారు.
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు దోహదం చేస్తాయని ఆమె తెలిపారు. 5జీ, కృత్రిమ మేథ సవాల్గా మారాయని, వాటిపై కలిసి పనిచేయడం కీలకమన్నారు. ఇండియాకు రావడం సంతోషంగా ఉందన్నారు. సువిశాల భారతదేశాన్ని, ఇక్కడి వైవిధ్యాన్ని గౌరవిస్తామని అన్నారు.
కాశ్మీర్లో పరిస్థితులు కుదుట పడాలని ఆకాంక్షించారు ఏంజెలా మెర్కెల్. మోడీ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉంటాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే అక్కడి పరిస్థితులు సానుకూలంగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, భారత జాతీయ గీతం వచ్చిన సమయంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూర్చుని ఉండటం చర్చనీయాంశంగా మారింది.