ఆంధ్రా రత్న పురస్కార గ్రహీత, కథక్ లెజెండర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఢిల్లీలోని సాకేత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంట్లో గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. బిర్జూ మహరాజ్ ఇక లేరనే విషయాన్ని ఆయన మనవడు స్వరాన్ష్ మహరాజ్ వెల్లడించారు.
కొద్దిరోజుల కిందటే ఆయన మేనల్లుడు పండిట్ మున్నా శుక్లా కన్నుమూశారు. బిర్జూ మహారాజ్ అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. 1938 ఫిబ్రవరి 4వ తేదీన ఉత్తర ప్రదేశ్ లక్నోలో జన్మించారు. ఆయనది కథక్ కుటుంబం. తండ్రి పేరు అచ్చన్ మహారాజ్, అతని మేనమామ పేరు శంభు మహారాజ్ కథక్ నృత్యకారులు. మొదట దుఖ్ హరణ్గా పేరు పెట్టారు. అనంతరం బ్రిజ్ మోహన్గా మార్చారు. అచ్చన్ మహరాజ్, శంభు మహరాజ్ నుంచి కథక్లో శిక్షణ తీసుకున్నారు. అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున పలు దేశాల్లో బిర్జూ మహరాజ్ కథక ప్రదర్శనలను ఇచ్చారు. రష్యా, అమెరికా, జపాన్, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ వంటి అనేక దేశాల్లో కథక్ నృత్య ప్రదర్శనలను ఇచ్చారు. కథక్ నృత్యాన్ని విశ్వవ్యాప్తంగా చేశారు. బిర్జూ మహారాజ్.. శాస్త్రీయ గాయకుడు కూడా. 28 సంవత్సరాల వయస్సులోనే సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు.
కాళిదాస్ సమ్మాన్ పురస్కారాలను అందుకున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. పలు రాష్ట్రాలు ఆయనకు అవార్డులను అందజేసి, గౌరవించాయి. ఏపీ ప్రభుత్వం ఆంధ్రా రత్న పురస్కారాన్ని అందజేసింది. నృత్య చూడామణి, నృత్య విలాస్, ఆధర్శిలా శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారాలను పండిట్ బిర్జూ మహరాజ్ అందుకున్నారు.
కొన్ని బాలీవుడ్ సినిమాలకు నృత్య దర్శకత్వాన్ని వహించారు. దిల్ తొ పాగల్ హై, దేవదాస్, గద్దర్- ఏక్ ప్రేమ్ కథల్లో రెండు పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. ఉమ్రావ్ జాన్, బాజీ రావ్ మస్తానీ వంటి కొన్ని బాలీవుడ్ సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే తీసిన షత్రంజ్ కె ఖిలాడీ మూవీకి కోరియోగ్రాఫర్గా పనిచేశారు.