కథువాలో మరో ఘోరం: కాపాడబోతే.. కత్తులతో పొడిచి హత్య!
కశ్మీర్: కథువాలో చిన్నారిపై అత్యాచార ఘటన మరవకముందే.. అదే గ్రామంలో మరో దారుణం చోటు చేసుకుంది. 22ఏళ్ల ఓ విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు మంగళవారం నాడు దారుణంగా పొడిచి హత్య చేశారు. ఓ యువకుడిని కాపాడే ప్రయత్నంలో దుండగులను అడ్డుకోబోగా.. వారు అతన్ని హత్య చేసినట్టు సమాచారం. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు నిరసనగా స్థానికులు అక్కడ ర్యాలీ చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. హత్యకు గురైన వ్యక్తిని లియాఖత్ అలీ (18)గా గుర్తించారు. రూ.500 విషయంలో తలెత్తిన గొడవే ఈ మొత్తం వ్యవహారానికి కారణంగా తెలుస్తోంది.
ఎవరు వాళ్లు?:
అబిద్-అభిషేక్ ఇద్దరు స్నేహితులు. అభిషేక్ వద్ద నుంచి అబిద్ కొద్దిరోజుల క్రితం రూ.500 అప్పుగా తీసుకున్నాడు. కానీ తిరిగి చెల్లించలేదు. దీంతో అభిషేక్ తన అన్న కజూరియా, తమ కాలనీలోనే ఉండే రింకూను అబిద్ నుంచి డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరాడు. దీంతో హత్యకు పాల్పడింది వీరే అని తెలుస్తోంది.
ఆ షాపులో దాక్కున్నాడు:
మంగళవారం మధ్యాహ్నాం అబిద్ కాలేజీ నుంచి బయటకు పరుగెత్తుకొచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ తినుబండారాల దుకాణంలో తలదాచుకున్నాడు. ఆ షాపు యజమాని పర్వేజ్ తో తనను రక్షించాల్సిందిగా బతిమాలాడు. కొంతమంది వ్యక్తులు కారులో తనను వెంబడిస్తున్నారని, దయచేసి తనను కాపాడాలని ప్రాధేయపడ్డాడు. దీంతో పర్వేజ్ పోలీసులకు ఫోన్ చేయగా.. అబిద్ నే పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా వారు సూచించారు. పోలీస్ స్టేషన్ ఆ ప్రాంతానికి 6కి.మీ దూరంలో ఉంది.
పోలీసులు వచ్చేసరికి పరార్..:
పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా పోలీసులు సూచించినప్పటికీ అబిద్ మాత్రం అక్కడినుంచి వెళ్లలేదు. దీంతో పర్వేజ్ మరోసారి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కానీ పోలీసులు అక్కడికి వచ్చేసరికి నిందితులు పారిపోయారు. అబిద్ ను షాపు నుంచి తీసుకొచ్చి బయట వదిలేశారు.
లియాఖత్ హత్య
పోలీసులు అక్కడినుంచి వెళ్లడమే ఆలస్యం.. స్విఫ్ట్ కారులో ఆ గ్యాంగ్ మళ్లీ అక్కడికి వచ్చింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అబిద్.. నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి దూరాడు. అక్కడే ఉన్న లియాఖత్.. అబిద్ పై దాడిని అడ్డుకోబోగా దుండగులు అతన్ని కత్తితో పొడిచి హత్య చేశారు. అడ్డుకోబోయిన పర్వేజ్ భార్య కూడా గాయాలపాలైంది. ఆమె చెయ్యి ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం.