కతువా నిందితుల తరుపున వాదించిన లాయర్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిగా నియామకం
న్యూఢిల్లీ : కతువా అత్యాచార ఘటనలో నిందితుల తరుపున వాదించిన న్యాయవాది అసీం సహానే ని జమ్ము కశ్మీర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్. అసీమ్ నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసీమ్ తండ్రి ఏకే సహానే కూడా న్యాయవాదే. ఆయనకూడా కతువా ఘటనకు సంబంధించి నిందితుల తరుపున పటాన్ కోట్ జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కతువా ప్రాంతానికి సమీపంలోని రసానా ప్రదేశాన్ని తమ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారనే సంచలన వ్యాఖ్యలు కొద్దిరోజుల క్రితం ఏకే సహానే చేశారు. అంతేకాదు నిందితుల తరుపున వాదిస్తున్నందున తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే అసీమ్ సహానేను ప్రభుత్వం తరపున ఆరాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా నియమిస్తున్నట్లు జమ్ము కశ్మీర్ న్యాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి 16 మంది న్యాయవాదుల్లో అసీమ్ కూడా ఒకరుగా ఉన్నారు.
కతువాలో 8 ఏళ్ల బాలికపై వరుసగా అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన కారణంగా బీజేపీ పీడీపీల మధ్య బేధాభిప్రాయాలు రావడం ప్రభుత్వం కూలిపోవడం కూడా జరిగిపోయాయి. నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం... సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం అక్కడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీంతో చేసేది ఏమిలేక చివరకు ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.