కథువా రేప్: బాధితురాలి పేరు, ఫొటో వాడినందుకు ఒక్కో మీడియాకు రూ. 10లక్షల జరిమానా
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని కథువా ప్రాంతంలో అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక పేరు, ఫొటో, ఇతర వివరాలను పలు మీడియా సంస్థలు బయటపెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు మీడియా సంస్థలపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలి పరిహార నిధికి పంపించాలని కోర్టు ఆదేశించింది.
చట్ట ప్రకారం మీడియా సంస్థలు అత్యాచార బాధితురాలి పేరును వెల్లడించకూడదు. అయితే ఇటీవల జరిగిన కథువా ఘటనలో బాధితురాలైన మైనర్ బాలిక పేరు, ఫొటో వివరాలను పలు వార్తా పత్రికలు, వార్తా ఛానళ్లు ప్రముఖంగా వెల్లడించాయి. దీంతో కోర్టు తీవ్రంగా ఖండించింది. అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెడితే వారికి 6నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసంది.
ఈ ఏడాది జనవరిలో కథువాలోని రసానా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను దాదాపు వారం రోజుల పాటు బంధించి, మత్తు పదార్థాలిచ్చి, అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా అరెస్ట్ చేశారు. కాగా, ఈ రేప్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.