కథువా రేప్పై డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్య, ఆ ర్యాలీలో పాల్గొన్న నేతకు పదవి
శ్రీనగర్: సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజీవ్ జస్రోతియాకు ప్రమోషన్ లభించింది. సోమవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి మెహబూబాబా ముఫ్తీ ఆయనను కేబినెట్లోకి తీసుకున్నారు.
రేప్ కేసు నిందితులకు మద్దతుగా హిందూ ఏక్తామంచ్ నిర్వహించిన ర్యాలీలో రాజీవ్తోపాటు మరో ఇద్దరు మంత్రులు లాల్ సింగ్, చందర్ ప్రకాశ్ గంగా పాల్గొన్నారు. అనంతరం విమర్శలు రావడంతో మంత్రులు ఇద్దరు రాజీనామా చేశారు. ఇప్పుడు రాజీవ్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
సోమవారం నిర్వహించిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఏడుగురు కొత్తవారే. వీరిలో ఇద్దరు పీడీపీ ఎమ్మెల్యేలు. ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కవీందర్ గుప్తా భర్తీ చేశారు. రాజీనామా చేసిన నిర్మల్ సింగ్ స్పీకర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కథువా చిన్న ఘటన
ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా మాట్లాడుతూ.. కథువా గ్యాంగ్ రేప్ చిన్న ఘటన అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. బాలికకు న్యాయం జరగాలన్నారు. కథువా చిన్న ఘటన అనడం వివాదాస్పదం అయింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. కేసుపై న్యాయ విచారణ జరుగుతోందని, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలన్నారు.
సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంత సులువు కాదు
సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంత సులువు కాదని, అవాంతరాలు ఉంటాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.