మానవమృగాలకు జీవిత ఖైదు : పోలీసులకు ఐదేళ్ల జైలు, కథువా లైంగికదాడి కేసులో కోర్టు తీర్పు
పఠాన్కోట్ : కథువా లైంగికదాడి కేసులో మానవమృగాలకు పఠాన్కోట్ కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సాంజీరామ్తోపాటు దీపక్ ఖజూరియా, పర్వేశ్కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. దోషులుగా తేలిన మరో ముగ్గురు పోలీసులు ఎస్ఐ ఆనంద్ దత్త, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రామ్, ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ వర్మకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
ఆరుగురు దోషులు ..
కథువా లైంగికదాడి కేసులో పోలీసులు ఏడుగురిని నిందితులుగా పేర్కొనగా.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సాంజీరామ్ కుమారుడు విశాల్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగతా ఆరుగురిని దోషులుగా తేల్చి కాసేపటి క్రితం శిక్ష ఖరారు చేసింది. గతేడాది జనవరిలో కశ్మీర్లోని కథువాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. కథువా రసానాకు చెందిన చిన్నారి 10 తేదీన గుర్రాలను మేపడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అటవీలో అరాచక చర్య ..
వారం రోజుల తర్వాత ఊరికి సమీపంలోని అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. బాలికపై సామూహిక లైంగికదాడి చేసి హత్య చేసినట్లు తేలింది. భూ వివాదం వల్ల ఏర్పడిన విద్వేషంతో చిన్నారిపై కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. రసానాలో బక్రవాల్ అనే సంచార తెగవాసులు గుర్రాలను మేపుకుంటూ ఉంటారు. భూముల వ్యవహారం, పొలాల్లో గుర్రాలను మేపే అంశంపై ఈ తెగవారికి, గ్రామస్థులకు మధ్య విభేదాలు తలెత్తాయి.
పగపట్టాడు ..
రెవెన్యూశాఖ మాజీ ఉద్యోగి సాంజీ రామ్.. బక్రవాల్ తెగపై కక్ష పెంచుకున్నాడు. వారిని అక్కడినుంచి తరిమేయాలనుకున్నాడు. ఇందుకోసం వ్యుహం రూపొందించారు. గుర్రాలు మేపేందుకు వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని గుడిలో బంధించాడు. అక్కడ చిన్నారికి మత్తుమందు ఇచ్చి సాంజీరామ్, ఇతరులు లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత బాలికను రాయితో కొట్టి హతమార్చి అడవిలో పడేశారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు సాంజీరామ్ స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చాడు.
వెలుగులోకి ..
హత్య వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సాంజీరామ్తో పాటు ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఈ కేసును కశ్మీర్ కోర్టు క్రైమ్ బ్రాంచికి అప్పగించింది. దర్యాప్తునకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. తర్వాత పంజాబ్లోని పఠాన్కోట్ కోర్టుకు కేసును బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పఠాన్కోట్ న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది.