ఉన్నావ్ రేప్: బాలికను ప్రలోభపెట్టిన, రేప్ టైంలో గది బయట కాపలా ఉంది మహిళ అరెస్ట్
ఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో చోటు చేసుకున్న కథువా అత్యాచారం కేసులో మంత్రులుగా ఉన్న ఇద్దరిని తొలగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సరైన సందేశం ఇచ్చారని చాలామంది భావిస్తున్నారు. అమ్మాయిల పట్ల ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేది లేదని తద్వారా సందశం ఇచ్చారని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఉన్నావ్ అత్యాచారం కేసులో ఇప్పటికే సీబీఐ నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత రెండో వ్యక్తి శశి సింగ్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐ వేగంగా దర్యాఫ్తు చేస్తోంది. శశిసింగ్ను శనివారం అరెస్టు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దగ్గరకు అత్యాచార బాధితురాలైన పదిహేడేళ్ల బాలికను ప్రలోభపెట్టి తీసుకెళ్లినట్లు ఈమెపై ఎఫ్ఐఆర్లో వివరంగా నమోదయింది. పైగా ఎమ్మెల్యే అత్యాచారం చేస్తుండగా గది బయట కాపలాగా ఉందని బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఉన్నావ్ రేప్: ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు, ఇద్దరు అదృశ్యం: బాధితురాలి బాబాయి
దీంతో సీబీఐ ఆ దిశగా దర్యాప్తు చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సెంగార్ను లక్నో ప్రత్యేక కోర్టు ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. జూన్ 4, 2017న తనపై సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కేసు పెట్టింది.
ఆమె తండ్రి పోలీసు కస్టడీలో ఉండగా ఎమ్మెల్యే సోదరుడు, అనుచరులు విచక్షణరహితంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రాష్ట్ర పోలీసులు పట్టించుకోకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను శుక్రవారం అరెస్టు చేశారు.
యూపీ రాష్ట్ర పోలీసులు రాసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికల్లో వివరాలను ఉద్దేశపూర్వకంగా రాయకుండా దాచినట్లు అనుమానిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
నమోదైన మూడు కేసుల్లో తమ దర్యాప్తు చేపట్టి, పూర్తి వివరాలతో అభియోగపత్రాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా శనివారం అత్యాచారం బాధితురాలైన బాలిక స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడారు. నేరం జరిగిందని ఆరోపించిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులు, అధికారులతో మాట్లాడారు. బాలికతో పాటు ఆమె తండ్రికి చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.