కాంగ్రెస్ కు షాక్, రాజ్యసభ ఎంపీ రాజీనామా, మాజీ ఐపీఎస్, తెలుగు టచ్, బీజేపీ తీర్థం ?!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి బుధవారం ఆయన పదవికి రాజీనామా చేశారు. కేసీ. రామమూర్తి ఆయన రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పంపించారు. రాజ్యసభ సభ్యత్వాని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీ. రామమూర్తి తీవ్ర చర్చకు కేంద్ర బిందువు అయ్యారు.
పదవి వచ్చిన నెలలో !
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సెప్టెంబర్ 14వ తేదీన పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులను కొత్తగా నియమించింది. సిబ్బంది, ప్రజా, న్యాయ, చట్టాల వ్యవహారాల శాఖ సభ్యుడిగా కేసీ. రామమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వం కేసీ. రామమూర్తిని కీలక పదవిలో నియమించిన ఒక్క నెలలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
మాజీ ఐపీఎస్, క్రాస్ ఓటింగ్
కర్ణాటక ఐపీఎస్ అధికారి అయిన కేసీ. రామమూర్తి రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. బెంగళూరుకు చెందిన కేసీ. రామమూర్తి 2016 జూన్ 11వ తేదీ కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆస్కర్ ఫెర్నాండిస్, జైరాం రమేష్ తో పాటు కేసీ రామమూర్తి పోటీ చేశారు. ఆ రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో కేసీ. రామమూర్తి 52 ఓట్ల బారీ మెజారిటీతో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆస్కర్ ఫెర్నాండిస్, జైరాం రమేష్ కు ఒక్కొక్కరికి 46 ఓట్లు మాత్రమే రావడం విశేషం.
భూ కబ్జాలు చేశారని ఫిర్యాదు
కేసీ. రామమూర్తి ఐపీఎస్ అధికారి. కర్ణాటక ఐజీపీగా కేసీ. రామమూర్తి పని చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో 2007లో కేసీ. రామమూర్తి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2006లో ఐజీపీగా ఉద్యోగం చేస్తున్న సమయంలో దోడ్డగుబ్బి సమీపంలోని అథినా టౌన్ షిప్ లో ఎన్ఐఆర్ (ప్రవాస భారతీయులు) స్థలాలు కబ్జా చేశారని కేసీ. రామమూర్తి మీద ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు చేశారని కేసీ. రామమూర్తి మీద 2013లొ ఫిర్యాదు చేశారు. సీఎంఆర్ జనార్దన్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కేసీ రామమూర్తి పని చేస్తున్నారు. బెంగళూరు నగరం సీఎంఆర్ విద్యాసంస్థలను కేసీ. రామూర్తి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు.
తెలుగు టచ్
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత కేసీ. రామమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎవ్వరికి వ్యతిరేకంగా తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యలేదని కేసీ. రామమూర్తి అంటున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని కేసీ. రామమూర్తి చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి పూర్వికులు తెలుగు వారు.
బీజేపీ తీర్థం ?
కర్ణాటక, జాతీయ రాజకీయాల్లో తాను ఇక ముందు చురుకుగా ఉంటానని కేసీ. రామమూర్తి అన్నారు. కాంగ్రెస్ గురించి, ఆ పార్టీ నాయకుల గురించి తాను మాట్లాడనని కేసీ. రామమూర్తి అన్నారు. బీజేపీలో తాను చేరుతానని జరుగుతున్న ప్రచారం గురించి త్వరలో క్లారిటీ ఇస్తానని కేసీ. రామమూర్తి మీడియాకు చెప్పారు. మొత్తం మీద కేసీ. రామమూర్తి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి కొలుకోలేని దెబ్బ పడింది.