బాహుబలి‘సీఎం’మీద ఫిర్యాదులు: మా మాట ఒక్కటి వింటే ఒట్టు, మా వల్లకాదు !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు, హోం శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తీరుతో తాము విసిగిపోయామని, మాకు వేరే నాయకత్వం కావాలని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు, హోం శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తీరుతో తాము విసిగిపోయామని, మాకు వేరే నాయకత్వం కావాలని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేసి పెద్ద చర్చకు తెరలేపారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాలు చూసుకుంటున్న దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా)ను ఇటీవల ఆ స్థానం నుంచి తప్పించారు. కేరళకు చెందిన సీనియర్ నాయకుడు కేసీ. వేణుగోపాల్ కు కర్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని అధిష్టానం సూచించింది.
వేణుగోపాల్ పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ఇటీవల బెంగళూరు వచ్చారు. పార్టీ వ్యహహారాలు ఇన్ చార్జ్ వేణుగోపాల్ ను కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కలిశారు. ఈ సందర్బంలో సీఎం సిద్దరామయ్య తీరుపై వేణుగోపాల్ కు ఫిర్యాదులు చేశారని వెలుగు చూసింది.
తాము చెప్పిన మాట ఒక్కటీ సీఎం సిద్దరామయ్య పట్టించకోవడం లేదని, పార్టీ వ్యవహారాల్లో ఆయన సొంత నిర్ణయం తీసుకుంటారని ఫిర్యాదు చేశారు. ఇక ఎదైనా సమస్యలు చెప్పాలని అనుకుంటే కేపీసీసీ అధ్యక్షుడు, హోం శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మా చేతికి చిక్కడం లేదని ఫిర్యాదు చేశారు.
సమర్థవంతుడైన నాయకుడిని కేపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తేనే రానున్న శాసన సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ ముందు తెగేసి చెప్పారని తెలిసింది. నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న వేణుగోపాల్ అందరూ కలిసికట్టుగా 2018లో జరగనున్న శాసన సభ ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్దం కావాలని సర్దిచెబుతున్నారని తెలిసింది.