6 పార్టీలు..185 స్థానాలు ఇదీ లెక్క: కాంగ్రెస్తో కేసీఆర్ మంత్రాంగం ఫలిస్తుందా..?
దేశవ్యాప్తంగా ఈ సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎవరికి వారు కూటములు కట్టుకుంటూ గణాంకాలపై తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రాంతీయ పార్టీల సంఖ్యాబలం కీలకం కానుంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు ప్రాంతీయ పార్టీల అధినేతలు. ఇందులో భాగంగానే కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేయగా... అదే స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రంలో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు.
ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీల చర్చలు
దేశంలో ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక పోలింగ్ సరళిని చూస్తే కేంద్రంలో మరో ప్రత్యామ్నాయం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇటు బీజేపీ కూటమి కానీ అటు యూపీఏకు కానీ స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఎవరూ విశ్లేషించడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ కాంగ్రెస్ చూపు ప్రాంతీయ పార్టీల వైపు మళ్లింది. ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నాయి. అయితే ఎవరికి వారే ప్రధాని కావాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇందుకోసమే తమతో కలిసొచ్చే పార్టీల కోసం నేతలు పాకులాడుతున్నారు.
కాంగ్రెస్తో కేసీఆర్ మంత్రాంగం..?
ఆరు రాష్ట్రాల్లోని పార్టీల అధినేతలు కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్లు ఈ సారి ఎన్నికల్లో వీరి పార్టీలు కలిస్తే దాదాపు 185 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. అంటే లోక్సభలోని మొత్తం సీట్లకు గాను మూడొంతులు స్థానాలు దక్కుతాయనే అంచనాతో ఉన్నారు. అయితే ఈ ఆరు పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్తో బేరసారాలకు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బిజూ జనతాదల్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, వైసీపీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కేసీఆర్కు మద్దతుగా నిలుస్తాయని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. కేసీఆర్ వీరి మద్దతు తీసుకుని కాంగ్రెస్తో లాబీయింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రధాని రేసులో లేని మమత.. రేసులో బెహెన్జీ
ఇప్పటి వరకు ప్రధాని పదవిపై మమతా బెనర్జీ కన్నేశారని వస్తున్న వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని పదవి రేసులో మమతా బెనర్జీ లేరన్న విషయం ఆమె కేసీఆర్తో జరిపిన ప్రాథమిక చర్చల్లో చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు తన రాష్ట్రమే ముఖ్యమని కేసీఆర్తో బీజేడీ అధినేత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ప్రధాని పదవికి రేసులో ఆయన కూడా లేరనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఎటొచ్చి మాయావతి మాత్రం ప్రధాని పీటంపై కూర్చోవాలనే ఆశతో ఉన్నట్లు ఈ మధ్య చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అర్థం అవుతుంది. ఇక కేసీఆర్ ప్రధాని పదవికి రేసులో లేనప్పటికీ... ఆయన మంత్రాంగం చాలా కీలకంగా మారనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటు కాంగ్రెస్తో వెళతారా లేక బీజేపీకి మద్దతుగా నిలుస్తారా అన్న విషయం పై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాతే ఏదైనా జరిగే అవకాశం ఉందని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు.
చంద్రబాబు బీజేపీ వైపు చూసే అవకాశం ఉందా..?
మరోవైపు చంద్రబాబు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు కేసీఆర్ల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతుగా నిలిస్తే కేసీఆర్ జగన్లు తమ సపోర్టును ప్రకటిస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు టార్గెట్ మోడీ మాత్రమే కానీ బీజేపీ కాదని మరో వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం లేకుంటే ఆ సమయంలో చంద్రబాబు మద్దతు తీసుకోవాలని కోరితే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉంది. మోడీ కాకుండా నితిన్ గడ్కరీ లేదా మరెవరైనా ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో.. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో శతృవులను కలుపుకుని పోతారా లేక మా దారి మాదే అని అంటారా అని తెలుసుకోవాలంటే మే 23 వరకు వేచిచూడక తప్పదు.