దీదీ విషయంలో కేసీఆర్ ది వ్యూహాత్మక నిశ్శబ్దమా..? రాజకీయమా..? ఎప్పుడు పెదవి విప్పుతారు..?
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన బెంగాల్ పరిణామాలపై చాలా మంది ప్రముఖులు స్పందిచారు. అలాగే కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, తెలుగుదేశం, ఎన్సీపీ, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జీడీ సహా దేశంలోని దాదాపు 23 పార్టీలు బెంగాల్ ముఖ్యమంత్రికి మద్దతు తెలిపాయి. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఆయన వ్యవహార శైలిపై కొద్ది రోజులుగా ఉన్న సందేహాలకు బలం చేకూరినట్లైందనే చర్చ జరుగుతోంది. ఇంతకి దీదీ పట్ల చంద్రశేఖర్ రావుది వ్యూహాత్మక మౌనమా..? లేక వేరే కారణం ఏదైనా ఉందా..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
బెంగాల్ పరిణామాలపై పెదవి విప్పని కేసీఆర్..!స్పందనపై నెలకొన్న ఉత్కంఠ..!!
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న యుద్ధం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేపట్టిన నిరసన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ వర్గాల్లో సర్వత్రా దీనిపైనే చర్చ జరుగుతోంది. శారదా, రోజ్వ్యాలీ స్కాంల దర్యాప్తును నీరుగార్చారనే ఆరోపణలతో కోల్కతా పోలీసు కమిషనర్, 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ను వెతుక్కుంటూ నగరానికి వచ్చిన సీబీఐ అధికారులకు మమత చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే..!
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ ఉదంతం..! మరోసారి ఏకమవుతున్న విపక్షాలు..!!
కోల్ కతా పోలీస్ కమీషనర్ ను అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులు వారెంట్ తీసుకురాకుండా వచ్చారనే ఉద్దేశ్యంతోనే వాళ్లను స్టేషన్కు తరలించామని మమత చెబుతున్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగానే పోరాటం చేస్తోంది. ఇది పెద్ద దుమారం రేపింది. దీంతో ఆమె ఆదివారం రాత్రి నుంచి నిరశనకు దిగారు. మరోవైపు మమత పోరాటానికి బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుందని వారంతా ముక్త కంఠంతో వాదిస్తున్నారు. ఆయా పార్టీల అధినేతలు మమత చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.
సీబీఐ వర్సెస్ మమత..! వేడి రగిల్చిన రాజకీయం..!!
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ మరో సారి తెరపైకి వచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు జరిపారు. అదే క్రమంలో మమతను కూడా కలిశారు. అయితే, ఆ తర్వాత మమత నిర్వహించిన ర్యాలీకి మాత్రం చంద్రశేఖర్ రావు హాజరు కాలేదు. తాజా పరిణామాలు పట్ల దేశాన్ని కుదిపేస్తున్న కూడా ఈ వ్యవహారంపైనా మౌనంగా ఉన్నారు. దీంతో చంద్రశేఖర్ రావు - బీజేపీ బంధం బలంగా ఉందనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ స్పందన..! మమతకు అనుకూలమా..? వ్యతికమా..? రాజకీయ వర్గాల ఆసక్తి..!!
దీనిపై తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు సైతం స్పందించారు. చంద్రశేఖర్ రావు బండారం బయటపడిపోయిందని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, బెంగాల్ ప్రభుత్వాన్ని నడిపే మమతా నా సోదరే, మోదీకి వ్యతిరేకంగా మేమంతా కలిసి పోరాడతాం అని చెప్పుకొచ్చిన చంద్రశేఖర్ రావు, పెద్ద ఎత్తున ధర్నాకి దిగిన మమతకు అండగా ఎందుకు నిలబడలేదు..? కోల్ కత వెళ్లకపోయినా కనీసం మద్దతు ఇస్తున్నట్లు ఎందుకు ప్రకటించలేకపోయారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మమత ఎపిసోడ్ పై మీడియాతో పాటు సోషల్ మీడియా చిత్ర విచిత్ర కథనాలు ప్రచురించకముందే చంద్రశేఖర్ రావు స్పందింస్తారో లేదో చూడాలి.