కదలివచ్చిన ముక్కంటి... తెరుచుకున్న కేదార్నాథ్ తలుపులు
కేదార్నాథ్ : పర్యాటకుల కోసం ఉత్తరాఖండ్ సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కేదార్నాథ్ ఆలయం ద్వారాలు కూడా భక్తుల కోసం తెరుచుకున్నాయి. 1200 ఏళ్లనాటి అతిపురాతనమైన ఈ శివాలయంను ఆదిశంకరాచార్య నిర్మించారు. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఈ ఆలయంలో ఉంది. కేదార్ నాథ్ ఆలయ విశిష్టత ఏంటి... ?
ఉత్తరాఖండ్కు ప్రధాన ఆదాయంగా ఉన్న చార్ధామ్ యాత్ర
చార్ధామ్ యాత్రలో భాగంగా కచ్చితంగా పర్యాటకులు లేదా భక్తులు వెళ్లే ప్రదేశం కేదార్నాథ్ ఆలయం. ఈ యాత్రలో కేదార్నాథ్ ఆలయంతో పాటు గంగోత్రి, యమునోత్రి, బద్రినాథ్లు కూడా ఉ:టాయి. ఈ నాలుగు ఆలయాలు ఉత్తరాఖండ్లోని గర్వాల్ డివిజన్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కేదార్నాథ్ను కొన్ని వేల మంది భక్తులు సందర్శిస్తారు. ఇక ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి చార్ధామ్ యాత్ర నుంచే అత్యధిక రెవిన్యూ వస్తుంది.
వేదమంత్రాల మధ్య తెరుచుకున్న కేదార్నాథ్ ద్వారాలు
గురువారం రోజున వేదమంత్రాల మధ్య కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయంలో శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తుల కోసం ద్వారాలను ఉదయం 5:35 గంటలకు తెరిచారు. ఏడాదిలో అత్యధిక కాలం ఈ ఆలయం మూసివేసే ఉంటుంది. సముద్రమట్టానికి 3500 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది. ఇక శీతాకాలంలో శివుని విగ్రహాన్ని ఉకిమత్ అనే గ్రామానికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఇక వేసవిలో వాతావరణం మెరుగుపడ్డాక, మంచు కురవడం తగ్గిన తర్వాత శివుని విగ్రహాన్ని తిరిగి ఆలయానికి చేరుస్తారు. ఇప్పటికే ఎండవేడిమికి చాలావరకు మంచు కరిగిపోయింది.అయితే ఆలయంపై ఇంకా అక్కడక్కడ మంచు కప్పబడిఉంది.
ఇదీ... కేదార్నాథ్ చరిత్ర
ఉత్తరాఖండ్లోని ఒక్క చమోలీ జిల్లాలోనే 200కు పైగా శివాలయాలు ఉన్నట్లు కేదార్నాథ్ ఆలయ కమిటీ చెబుతోంది. పాండవులు కౌరవులపై యుద్ధంలో విజయం సాధించిన తర్వాత చాలా బాధపడినట్లు చరిత్ర చెబుతోంది. సొంత సోదరులను చంపుకున్నామే అనే బాధ వారిలో కలిగిందట. శాపం తగలకుండా పాపవిమోచన కలిగించాలంటూ శివుడిని పదేపదే వేడుకున్నారట. అయితే వారి నుంచి శివుడు తప్పించుకునే క్రమంలో కేదార్నాథ్కు వచ్చి వృషభ రూపంలో అక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. కేదార్నాథ్ ఆలయంను బూడిద రంగులో ఉన్న అతిపెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ రోజుల్లో ఈ రాళ్లతో ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
2013లో రాష్ట్రాన్ని వరదలు ముంచినప్పటికీ ధ్వంసం కాని కేదార్నాథ్ ఆలయం
ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయంను 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. రిషికేష్లోని ఓ ఎన్జీఓ సంస్థ ఈ పూలను విరాళంగా ఇచ్చినట్లు బద్రినాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఛైర్పర్సన్ మోహన్ లాల్ థాప్లియాల్ తెలిపారు. 2013లో ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం వరదల్లో మునిగిపోయింది. అయితే మందాకిని సరస్వతి నదుల తీరాన ఉన్న కేదార్నాథ్ ఆలయంకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇక భక్తులు రాత్రి వేళల్లో విడిది చేసేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టెంట్లు నిర్మాణం చేపట్టింది. ధ్వంసమైన గుడిసెలకు మరమత్తులు చేపట్టింది. కార్తీకమాసం తొలిరోజున అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో కేదార్నాథ్ ఆలయంను మూసివేయడం జరుగుతుంది. తిరిగి వైశాఖ మాసం అంటే ఏప్రిల్ మే నెలల మధ్య ఆలయద్వారాలు తెరుచుకుంటాయి.