రైతు నిరసనల మాటున రాజకీయం- కేజ్రివాల్ వర్సెస్ అమరీందర్ మాటల యుద్ధం
ఢిల్లీ సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిని కూడా లెక్కచేయకుండా వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తుంటే ఇప్పుడు వీటిలో రాజకీయాలను వెతుక్కునే పనిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీగా కనిపిస్తున్నారు. ఇందులో ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కాగా మరొకరు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. వీరిద్దరి లక్ష్యం ఒక్కటే. 2022లో జరిగే పంజాబ్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్ధానాలు గెల్చుకోవడమే. దీంతో రైతుల కోసం నువ్వే చేశావంటే నువ్వే చేస్తున్నావంటూ వీరిద్దరూ మాటల యుద్ధం సాగిస్తున్నారు. వీరిద్దరి ఉమ్మడి శత్రువు కేంద్రంలోని ఎన్డీయే సర్కారే కావడం మరో విశేషం.
పతాకస్ధాయిలో రైతుల నిరసనలు..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఎలాగైనా వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ పోరుబాట పట్టిన పంజాబ్, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా కాచుకుని ఉన్నారు. వీరికి మద్దతుగా అటు పంజాబ్లోని అమరీందర్ సింగ్ ప్రభుత్వం, ఇటు ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే రైతులతో కలిసి కేజ్రివాల్ నేరుగా ఆందోళనల్లో పాల్గొంటుంటే, ఇటు అమరీందర్ కూడా రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
దీంతో రైతు నిరసనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. కేంద్రం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తున్నా రైతులు పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు.
అమరీందర్ వర్సెస్ కేజ్రివాల్
రైతుల నిరసనలపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా అంతే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ నిరసనలకు మద్దతుగా రంగంలోకి దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ను టార్గెట్ చేస్తూ మాటల యుద్ధం మొదలుపెట్టారు. తాజాగా కేంద్రంతో సమావేశమైన అమరీందర్, రైతు ఆందోళన విషయంలో రాజీ పడుతున్నారని, తన కుమారుడిపై దాఖలైన ఈడీ కేసే ఇందుకు కారణమని కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. నీ కొడుకు ఈడీ కేసు కోసం రైతులను అమ్మేస్తున్నావని అమరీందర్పై కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రైతులకు మద్దతుగా తాను నిరాహార దీక్షకు దిగుతానన్నారు. అయితే కేజ్రివాల్ ఇదంతా వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల కోసమే చేస్తున్నారని అమరీందర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేజ్రివాల్లా తాను అదానీ వంటి ప్రైవేటు సంస్ధలతో ఒప్పందాలు చేసుకోలేదని అమరీందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరి టార్గెట్ పంజాబ్ ఎన్నికలే..
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతుల్లో అత్యధిక శాతం పంజాబ్ రైతులే ఉన్నారు. వీరి తర్వాత స్దానాల్లో ఇతర రాష్ట్రాల అన్నదాతలు ఉన్నారు. దీంతో పంజాబ్ రైతులకు మద్దతుగా అమరీందర్తో పాటు కేజ్రివాల్ స్వరం వినిపిస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. రైతుల ఆందోళన భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు. కాబట్టి ఇందులో తాము ఛాంపియన్లుగా నిలిస్తే పంజాబ్ ఎన్నికల్లో రైతులతో పాటు ఇతర వర్గాల మద్దతు లభించడం సులువని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి. దీంతో అమరీందర్, కేజ్రివాల్ రైతు నిరసనలను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి అవకాశం లేకుండా చేయాలనే లక్ష్యంతోనే వీరు దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తోంది.