డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్..దాని కోసమేనంటూ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరుకు రూ.8.36 తగ్గిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన కేజ్రీవాల్... డీజిల్పై వ్యాట్ 30శాతం నుంచి 16.75శాతం వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో లీటరుకు రూ.82గా ఉన్న డీజిల్ ధర రూ.73.64కు తగ్గింది. ఇది ఢిల్లీ ప్రజలకు భారీ ఊరటనివ్వడమే కాకుండా ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా రోజ్గార్ బజార్ అనే పోర్టల్ను ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 2,04,785 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు 7577 కంపెనీలు పోర్టల్ పై పోస్టు చేశాయి. అంతేకాదు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 3,22,865 మంది పోర్టల్ పై రిజిస్టర్ చేసుకున్నారు.
ప్రస్తుతం కరోనా ఢిల్లీలో తగ్గుముఖం పడుతోందని చెప్పిన కేజ్రీవాల్... దాదాపు రెండు కోట్ల మంది ఢిల్లీ వాసుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. అయితే కరోనావైరస్ నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించాలని లేదంటే మహమ్మారి మళ్లీ పేట్రేగే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఢిల్లీలో ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలో అనేదానిపై ఫోకస్ చేయాలని చెప్పారు. లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటంతో చాలామంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గతంలో కూడా ఢిల్లీ వాసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వాటిని విజయవంతంగా దాటుకుని వచ్చారని గుర్తుచేశారు కేజ్రీవాల్. ఇప్పుడు కూడా ఈ ఆర్థికపరమై సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. ఈ క్రమంలోనే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కేజ్రీవాల్ ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుందని చెప్పారు.
నిన్నటి వరకు ఢిల్లీలో డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించిన సీఎం కేజ్రీవాల్... తాజా నిర్ణయంతో ప్రజలకు భారీ ఊరటనివ్వడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతం అందిస్తుందని చెప్పారు. డీజిల్ ధరలు తగ్గించాలని చాలామంది వర్తకులు, వ్యాపారస్తులు డిమాండ్ చేశారని చెప్పారు. అధిక డీజిల్ ధరల వల్ల ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతోందని దీంతో ఆ ప్రభావం వాణిజ్యం పై పడుతోందని తన దృష్టికి తీసుకొచ్చినట్లు సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గతవారం రోజులుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. రోడ్డు పక్కన చిరువ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని భావించి వారు ఢిల్లీ నగరంలో కూడా తమ వ్యాపారాలు నిర్వహించుకోవచ్చనే ప్రకటన సోమవారం చేసినట్లు గుర్తు చేశారు కేజ్రీవాల్. అంతేకాదు ఢిల్లీ ప్రభుత్వం జాబ్ పోర్టల్ ప్రారంభించిందని తద్వారా లేబర్ లేక ఇబ్బంది పడిన పరిశ్రమలకు కార్మికులు లభిస్తారని పేర్కొన్నారు. యాజమాన్యాలకు నిరుద్యోగులకు ఈ జాబ్ పోర్టల్ ఒక వంతెనలా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ పోర్టల్కు భారీ స్థాయిలో స్పందన వచ్చిందని చెప్పారు.
ఒక జీన్స్ మానుఫాక్చరింగ్ సంస్థలో 35 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆ సమయంలో ఢిల్లీ జాబ్ పోర్టల్పై ప్రకటన ఇవ్వగానే ఆ యజమానికి దాదాపు 190 మందికి పైగా ఉద్యోగం కోసం ఫోన్లు చేసినట్లు ఆ సంస్థ యజమాని టీవీలో చెప్పడం తాను విన్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీని తిరిగి గాడిలో పెట్టేందుకు వర్తకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అంతా చేతులు కలిపి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రతి దుకాణాదారుడు, పారిశ్రామికవేత్తలు తమ దుకాణాలను పరిశ్రమలను తెరవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడమే కాకుండా భౌతిక దూరాన్ని పాటించాలని సీఎం కేజ్రీవాల్ అభ్యర్థించారు. రానున్న రోజుల్లో వీరందరితో జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో టచ్లోకి వచ్చి మాట్లాడతానని వారికున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.