కేజ్రీవాల్ కుమార్తె ఆవేదన: నాన్న గీతోపదేశం చేస్తారు.. ఆయన ఉగ్రవాది ఎలా అవుతారు?
Recommended Video
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదులతో పోల్చడంపై ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ నేతలు ఒక ముఖ్యమంత్రిపై అలా నిందలు వేయడం సరికాదన్నారు. తన తండ్రిని ఎన్నికల్లో ఎదుర్కొనలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హర్షితా మండిపడ్డారు. కేజ్రీవాల్ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ఢిల్లీ అభివృద్ధికి అక్కడ నివసించే సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇక మేనిఫెస్టోలో కూడా అభివృద్ధిపైనే హామీలిచ్చారని గుర్తు చేశారు కేజ్రీవాల్ కుమార్తె హర్షిత.
నాణ్యతతో కూడిన విద్య, 24 గంటల విద్యుత్, తాగునీరు లేక ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అధికారంలోకి మళ్లీ వస్తే తన తండ్రి కేజ్రీవాల్ ఇవ్వన్నీ పూర్తి చేస్తారని హర్షిత చెప్పారు. ఇక తన తండ్రికి దైవభక్తి ఎక్కువే అని చెప్పిన హర్షితా ప్రతిరోజు ఉదయం కుటుంబ సభ్యులతో భగవద్గీత చదివిస్తారని చెప్పారు. అంతేకాదు ఇన్సాన్ సే ఇన్సాన్ కా హో భైచారా అనే గీతాన్ని కూడా అందరం పాడుతామని స్పష్టం చేశారు. భగవద్గీత చదివిని తర్వాత అందులోని ఉపదేశాలను భావాలను కేజ్రీవాల్ తమకు వివరిస్తారని హర్షితా చెప్పారు. ఇలా చేస్తే ఉగ్రవాదం అంటారా అని ప్రశ్నించిన హర్షితా.. ఇలా భగవద్గీత గురించి బోధించేవారిని ఉగ్రవాది అంటారా.. అని ఆవేదన వ్యక్తం చేశారు.
Harshita Kejriwal: My father has always been in social services. I still remember he used to wake us - my brother, mother, grandparents and I, up at 6 AM, make us read Bhagwad Gita & sing 'Insaan se insaan ka ho bhaichara' song and teach us about it. Is this terrorism? (04.02) https://t.co/zNHF6kISLa
— ANI (@ANI) February 5, 2020
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ మరియు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్లు అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదితో పోల్చారు. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులు దాగి ఉన్నారని వారు వెళితేనే ఢిల్లీ బాగుపడుతుందనే వ్యాఖ్యలను పర్వేష్ వర్మ చేయగా... అరవింద్ కేజ్రీవాల్ ముమ్మాటికీ ఉగ్రవాదే అని అందుకు రుజువులు ఉన్నాయంటూ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కేజ్రీవాల్ ప్రత్యర్థి మనోజ్ తివారీని ఉగ్రవాదం కామెంట్స్పై స్పందిచమని అడుగగా... దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి మద్దతు పలుకుతున్న వారిని ఏమని పిలవాలంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు.
ఇక తనపై బీజేపీ నేతలు ఉగ్రవాది ముద్ర వేయడాన్ని ఖండించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలకు స్పష్టత ఇచ్చారు. తనను ఉగ్రవాది అని ఢిల్లీ ప్రజలు భావిస్తే ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలపై కమలం గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కాలని చెప్పారు. ఒకవేళ గడిచిన ఐదేళ్లలో తను ఢిల్లీ అభివృద్ధి కోసం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేశానని భావించినట్లయితే అదే ఈవీఎంపై ఉన్న చీపురు గుర్తు బటన్ నొక్కాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.