'కేజ్రీవాల్ ఎమోషనల్ డ్రామా, విశ్వాస్ తప్పు చేయలేదు సరే'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగ నాటకానికి తెర తీశారని, అలాంటివి విజయవంతం కావని ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ బర్కా శుక్లా సింగ్ బుధవారం మండిపడ్డారు. మంగళవారం నాడు హైడ్రామా జరిగిన విషయం తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ పైన పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో సంబంధం ఉందనే ఆరోపణలు, స్వయంగా సదరు మహిళా కార్యకర్త ఫిర్యాదు నేపథ్యంలో డీసీడబ్ల్యూ.. కుమార్ విశ్వాస్కు నోటీసులు జారీ చేసింది. ఆయన మంగళవారం కమిషన్ ఎదుట హాజరు కాలేదు.
దీంతో మరోసారి నోటీసులు జారీ చేయాలని డీసీడబ్ల్యూ భావించింది. ఇది మంగళవారం డీసీడబ్ల్యూలోనే హైడ్రామాకు తెరదీసింది. ఓ డీసీడబ్ల్యూ సభ్యురాలు తన పదవికి గుడ్ బై చెప్పారు. దీనిపై డీసీడబ్ల్యూ చీఫ్ బర్కా స్పందించారు.
కేజ్రీవాల్ ఎమోషనల్ డ్రామాను పండిస్తున్నారని విమర్శించారు. అయితే, ఇలాంటివి వర్కవుట్ కావని గుర్తుంచుకోవాలన్నారు. ఆమె కుమార్ విశ్వాస్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎలాంటి తప్పు చేయకుంటే, బాధిత మహిళను కాపాడేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.
ఊహాగానాలు లేదా ఆరోపణలతో తాము నోటీసులు జారీ చేయలేదని, మహిళా కార్యకర్త ఫిర్యాదు చేశారని అన్నారు. కుమార్ విశ్వాస్ తప్పు చేశారని తాము చెప్పడం లేదని, కానీ ఆయన ఎందుకు కమిషన్ ముందు హాజరు కావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు ఆయనకు ఉన్న సమస్య ఏమిటన్నారు. ఈ రోజైన అతను కమిషన్ ఎదుట వివరణకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు.