ఒక్క తప్పు చేయలేదు: కేజ్రీవాల్పై హజారే ప్రశంసలు
రాలేగావ్: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఆదివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రశంసలు కురిపించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క తప్పుడు నిర్ణయం కూడా తీసుకోలేదని హజారే ప్రశంసించారు.
కేజ్రీవాల్ పరిశుద్ధుడని, ఆయన అందరికీ ఆదర్శమని చెప్పారు. రాజకీయాలను సామాన్యుడి చెంతకు మరింతగా చేర్చారన్నారు. కేజ్రీవాల్ రాజకీయాల్లో విలువలను పాటిస్తున్నారన్నారు. గత ఏడాదిగా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చూడలేదన్నారు.
కేజ్రీవాల్ ఓ సిద్ధాంతకర్త అని, రాజకీయాల్లో నైతిక విలువలను పెంపొందించారన్నారు. కొత్త పార్టీ ప్రారంభించడం ధనవంతులకే సాధ్యమయ్యేదని, కేజ్రీవాల్ ఆ విధానాన్ని మార్చి సామాన్యులను రాజకీయాల వైపు నడిపించారన్నారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఆదర్శవాది అన్నారు. పంజాబ్లో రైతు సమస్యలే ప్రధానమైనవని, ఏఏపీ దానినే ముఖ్యాంశంగా తీసుకొని ఎన్నికలకు వెళితే బాగుంటుందన్నారు. దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు తీవ్రమైన అంశమని, దీనిపై ప్రభుత్వం ముసాయిదా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశాన్ని విస్తృతం చేయడానికి సత్యాగ్రహం, జైల్ భరో వంటి శాంతియుత కార్యక్రమాలు చేపడుతామని హజారే తెలిపారు. కేజ్రీవాల్ను ప్రశ్నిస్తున్న ప్రజలు, తాను లేఖలు రాసినా స్పందించని ప్రధాని మోడీని ఎందుకు నిలదీయడంలేదన్నారు. లోక్పాల్పై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 30వ తేదీన ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, అన్నా హజారేకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. జనవరి 12న ఓ బెదిరింపు కాల్ వచ్చింది. జనవరి 26వ తేదీయే నీకు చివరి రోజు అని, దానికి సిద్ధంగా ఉండాలని బెదిరింపు వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.