ట్విస్ట్: నా ఇంట్లో మఫ్లర్లు దొరికేవని కేజ్రీ, 'సారీ చెప్పాలి'
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డిడిసిఎ) నిధుల దుర్వినియోగం విషయం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డిడిసిఎ నిర్వహణ బాధ్యతలు చూసిన కాలంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిపినట్లు ఏఏపీ ఆరోపించింది.
సాక్షాత్తూ ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహించిన విచారణలో మాత్రం ఎక్కడా జైట్లీ పేరు ప్రస్తావనకు రాలేదు. జైట్లీపై అనవసరంగా ఆరోపణలు మోపిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వ విభాగం ముఖ్య కార్యదర్శి చేతన్ సింగ్ నేతృత్వంలోని త్రిసభ్య సంఘం డిడిసిఏ వ్యవహారంపై 237 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఇందులో ఎక్కడా జైట్లీ పేరు ప్రస్తావించలేదు. అదే సమయంలో డిడిసిఎ పైన వచ్చిన ఆరోపణల దృష్ట్యా బిసిసిఏ ఈ క్రికెట్ సంఘాన్ని సస్పెండ్ చేయాలని అభిప్రాయపడింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... జైట్లీ నిర్దోషి అని చెప్పేందుకు కొన్ని ప్రసార మాధ్యమాలు ఎలాంటి విఫలయత్నాలు చేస్తున్నాయో చూడటం ఆసక్తికరంగా ఉందని చెప్పారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
సిబిఐ తన నివాసంపై దాడి చేసినట్లయితే లెక్కల్లో చూపని నాలుగు మఫ్లర్లు మినహా మరేమీ పట్టుబడేవి కాదని ఎద్దేవా చేశారు. ప్రధాని తమ కార్యాలయంపై సిబిఐ చేత దాడి చేయించినా ఏమీ పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ అన్నారు.
సీబీఐ సోదాలు తననేమీ చేయలేవని కేజ్రీవాల్ చెప్పారు. తన ఇంటిలోనూ సోదాలు చేసుకోవచ్చన్నారు. ఒకవేళ తన ఇంటిలో సోదాలు చేస్తే, సీబీఐ అధికారులకు కేవలం మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయన్నారు. కేజ్రీవాల్ ‘మఫ్లర్ మ్యాన్'గా గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించిన విషయం తెలిసిందే.