మోడీ: ప్రభుత్వందిశగా కేజ్రీ, బిజెపి సిఎం అభ్యర్థిగా బేడీ?
న్యూఢిల్లీ: ఢిల్లీలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలుసుకున్న ఆయన రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవద్దని కోరారు. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అన్న అంశంపై ప్రజాభిప్రాయం కోరతామని, ఇందులో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేశారు.
పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియాతో కలిసి దాదాపు అరగంటకు పైగా లెఫ్ట్నెంట్ గవర్నర్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే కేజ్రీవాల్ వెళ్లిపోయారు. ఈ సమావేశానికి సంబంధించి రాజకీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడైతే లోకసభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలను బిజెపి గెలుచుకుందో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేజ్రీవాల్పై డిమాండ్ పెరిగింది.
బిజెపి లేదా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ను కోరారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మోడీ ప్రభంజనంలో కొట్టుకుపోతామని అందుకే ప్రభుత్వ ఏర్పాటకు చొరవ తీసుకోవాలని ఎఎపి శాసన సభ్యులు చెబుతున్నారట. మరోవైపు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎఎపికి మద్దతు ఇచ్చేకంటే తాజాగా ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్ధమని కాంగ్రెస్ పేర్కొంది. బిజెపి కూడా ఇదే అభిప్రాయంతో ఉంది.
బిజెపి సిఎంగా కిరణ్ బేడీ?
మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలిచ్చారు. ఆమె ఇటీవలి కాలంలో నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని తాను తోసిపుచ్చనంటూ ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఆమె బిజెపిలో చేరే అవకాశాలు లేకపోలేదని, ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.