భార్యను కలిసిన కేజ్రీవాల్: తీహార్ జైలులో వాకింగ్
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా వ్యవహారంలో తీహార్ జైలు పాలైన ఆమ్ అద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం పూట వాకింగ్ చేశారు. తీహార్ జైలులో ఉన్న తనను చూడడానికి వచ్చిన భార్యను, పార్టీ నాయకులను ఆయన కలిశారు.
కేజ్రీవాల్ రాత్రి నిద్రపోయి, గురువారం తెల్లవారు జామునే లేచారు. మార్నింగ్ చేసిన తన సెల్లోకి తిరిగి వచ్చారు. తనకు వడ్డించిన బ్రేక్ఫాస్ట్ చేశారు. తన సెల్లో మూడు నాలుగు వార్తాపత్రికలను చదివారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ పార్టీ సహచరులు సంజయ్ సింగ్, అశుతోష్లతో మాట్లాడారు. అరగంట పాటు వారితో ఆయన ముచ్చటించారు.
తన భార్య సునీతను కలిశారు. ఆయన కోసం భార్య సునీత దుస్తులు, మందులు తీసుకుని వచ్చారు. ఆయన గార్డులతో, ఇతర జైలు సిబ్బందితో మాట్లాడారు. తాను సామాన్యుల కోసం పోరాటం చేస్తున్నానని, అందుకే జైలుకు వచ్చానని ఆయన వారితో చెప్పారు.
కేజ్రీవాల్ను బుధవారం అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. ఆయనకు మే 23వ తేదీ వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బుధవారం రాత్రి ఆయనకు జైలులోని ఆహారం అందించారు. 400 గ్రాముల ధాన్యంతో కూడిన చపాతి, 250 కూరగాయలతో చేసిన కర్రీ, 90 గ్రాముల పప్పు వడ్డించారు.
జైలు నెంబర్ ఫోర్ వార్డులో ఆయన ధ్యానం చేశారు. గతంలో లోక్పాల్ పోరాటం చేసినప్పుడు అన్నా హజారేను ఇక్కడే ఉంచారు.