ఫార్చ్యూన్ ఒకే ఒక్కడు కేజ్రీవాల్: మోడీకి దక్కని చోటు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ 50 మందితో రూపొందించిన ప్రపంచ గొప్ప నేతల జాబితాలో కేజ్రీవాల్ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన 50 మంది గొప్ప వ్యక్తులతో కూడిన జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించింది.
ఈ జాబితాలో ఈ ఏడాది చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు అరవింద్ కేజ్రీవాల్ కావడం విశేషం. 50 మంది గొప్ప వ్యక్తుల జాబితాలో కేజ్రీవాల్ 42వ స్థానంలో నిలవగా, భారత ప్రధాని నరేంద్రమోడీకి చోటు దక్కించుకోలేదు. ఈ జాబితాలో అమెజాన్ సీఈఓ జోఫ్ బెబోస్ మొదటి స్థానంలో ఉన్నారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి 13 శాతం మేరకు కాలుష్యాన్ని తగ్గించినందుకు గాను అరవింద్ కేజ్రీవాల్ను ఎంపిక చేసినట్లు ఫార్చ్యూన్ మేగజైన్ తెలిపింది. ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 2, మయన్మార్ నేత ఆంగ్ శాన్ సూచీ 3, పోప్ ఫ్రాన్సిస్ 4, యాపిల్ సీఈవో టిమ్ కుక్ 5వ స్థానంలో ఉన్నారు.
బిజినెస్, గవర్నమెంట్, ఫిలాంథ్రపీ, ఆర్ట్స్ రంగాలను నుంచి వీరిని ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే అమెరికాలోని సౌత్ కరోలియా గవర్నర్గా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హెలే 17వ స్థానం, మరో భారతీయ అమెరికన్ రేషమ్ సౌజానీ 20వ స్థానం దక్కించుకున్నారు.