రాసలీలల ఢిల్లీ మంత్రికి కెజ్రీవాల్ ఉద్వాసన
న్యూఢిల్లీ: అభ్యంతకరమైన స్థితిలో కెమెరాకు చిక్కిన ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సందీప్కుమార్కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్వాసన పలికారు. అందుకు సంబంధించిన సీడీని అందుకున్న వెంటనే కేజ్రీవాల్ ఆయనపై వేటు వేశారు.
ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్న అనంతరం ట్విట్టర్లో ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆహార పౌరసరఫరాల మంత్రి అసీం అహ్మద్ఖాన్ తర్వాత ఉద్వాసన గురైన రెండో మంత్రి సందీప్కుమార్.
ఓ మహిళతో రాసలీలలకు పాల్పడుతూ సందీప్ కుమార్ కెమెరాకు చిక్కినట్లు, కేజ్రీవాల్కు అందిన సిడి అదేనని అంటున్నారు. అర గంట క్రితం సిడి తమకు అందిందని, ఆ సిడిని చూసిన తర్వాత వెంటనే ఆయనకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. నేరాలను, అవినీతిని తాము ఏ మాత్రం సహించబోమని అన్నారు.
సందీప్ కుమార్ సుల్తాన్ పూర్ మజ్రా నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ విధమైన చర్యలను తాము ఏ మాత్రం సహించబోమని, ముఖ్యమంత్రితో సహా తమ 67 మంది శానససభ్యుల్లో ఎవరు తప్పు చేసినట్లు తేలినా వెంటనే చర్యలు తీసుకుంటామని, మిగతా పార్టీలకు భిన్నంగా తాము వ్యవహరిస్తామని సిసోడియాచెప్పారు.