సిబిఐ ఆఫీస్లో కేజ్రీ ముఖ్య కార్యదర్శి: ఇవీ కేసులు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సిబిఐ మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంగళవారం నాడు ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
రాజేంద్ర కుమార్ ఇంట్లో 14 మద్యం సీసాలు లభించాయని కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాటిని ఇంట్లో ఉంచినందుకు రాజేంద్ర కుమార్ పైన సీబీఐ కేసు పెట్టింది. వీటిల్లో కొన్ని విదేశీ మద్యం బాటిళ్లు ఉండటంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై రాజేంద్రను అధికారులు మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
సిబిఐ కార్యాలయానికి రాజేంద్ర కుమార్
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ బుధవారం ఉదయం సిబిఐ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తారు.
కాగా, సీఎం కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయం, నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించడం పెను రాజకీయ దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్ మండిపడగా.. ఆయన ఆరోపణలను కేంద్రం, బిజెపి, సీబీఐ గట్టిగా తోసిపుచ్చాయి.
కేసు ఏమిటి?
ఢిల్లీ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రాజేంద్ర కుమార్ పని చేసిన సమయంలో కొన్ని సంస్థలకు టెండర్లు దక్కడానికి అనుకూలంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆయా సంస్థలకు 2007-14 మధ్య కాలంలో రూ.9.5కోట్ల విలువైన ఐదు కాంట్రాక్టులు దక్కేలా మేలు చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఢిల్లీ, యూపీలో పద్నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులను గుర్తించిందని తెలుస్తోంది.
ఈ సోదాల్లో రూ.2.4లక్షల నగదు సహా రూ.16లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ తెలిపింది. రూ.3లక్షల విలువైన విదేశీ నగదును రాజేంద్ర కుమార్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. రాజేంద్ర కుమార్పై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సోదాల అనంతరం రాజేంద్రకుమార్ను సీబీఐ అధికారులు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి ఏడుగంటల పాటు ప్రశ్నించారు.