నిజం నిర్బయంగా ఒప్పుకున్న కేజ్రీవాల్..! మోదీ ప్రభావం ఢిల్లీ మీద పడిందన్న ఆప్ చీఫ్..!!
ఢిల్లీ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభావం దిల్లీపై కూడా పడినట్టు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమరం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్యే అని దిల్లీ ప్రజలు భావించారని పేర్కొన్నారు. మోదీ తరహా రాజకీయాలు దిల్లీ మీద కూడా ప్రభావం చూపాయని వెల్లడించారు. వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఆయన ఆప్ కార్యకర్తల్లో నిరాశను తొలగించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. పార్టీ వాలంటీర్లు పూర్తి సామర్థ్యంతో ప్రచారాన్ని అద్భుతంగా నిర్వహించారు.
ఆప్ పార్టీకి చెందిన అభ్యర్థులు తగినవారని దేశ ప్రజలు భావించారని, అయితే ఫలితాలు మాత్రం ఊహించినట్లు రాలేదని కేజ్రీ వాల్ తెలిపారు. ఎన్నికల తరువాత సర్వే నిర్వహించి రెండు విషయాలు గుర్తించామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావమే దిల్లీలోను పనిచేయడం ఒక కారణం కాగా..సార్వత్రిక ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్యే అని భావించి, దానికి అనుగుణంగానే ఓటు వేయడం మరో కారణం అని కేజ్రీవాల్ వెల్లడించారు.
కారణమేదైనా, ఆప్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోయామన్నారు. దిల్లీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వచ్చే విధాన సభ ఎన్నికల్లో ఆప్కు ఓటు వేస్తామని ప్రజలు హామీ ఇచ్చారన్నారు. తాజాగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో దిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో ఆప్ ఓటమి చవిచూసింది. బీజేపీ అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకొని అద్భుత విజయాన్ని నమోదు చేసిందని, ఇది ముమ్మాటికి మోదీ ప్రభావమేనని కేజ్రీవాల్ తెలిపారు.