చేతులు జోడించి వేడుకుంటున్నా.. అవసరమైతే నన్ను కొట్టండి.. : కేజ్రీవాల్
ఢిల్లీ : పార్లమెంట్ సెక్రటరీ పదవుల విషయంలో ప్రధాని మోడీని ప్రాధేయపడే స్థితికి చేరుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఏమైనా పేచీలుంటే తనతో తగువులాడాలని, అవసరమైతే తనను కొట్టినా భరిస్తాను గానీ ఢిల్లీ ప్రజలను మాత్రం వేధింపులకు గురిచేయవద్దన్నారు. ఇందుకోసం రెండు చేతులు జోడించి బతిమాలుకుంటున్నానని ప్రధాని మోడీకి మీడియా ముఖంగా విన్నవించారు.
ఢిల్లీలోని చాలా అభివృద్ది పనులు పార్టమెంటరీ సెక్రటరీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ప్రభుత్వానికి పంచేంద్రియాల్లా వ్యవహరిస్తున్న ఆ నేతలను ఇప్పడు పార్లమెంటరీ సెక్రటరీ పదవుల్లో నుంచి తప్పిస్తే ప్రభుత్వంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
గతంలో ఢిల్లీని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించుకున్నాయని, ఇప్పుడు తమ విషయానికొచ్చే సరికి మాత్రం చట్ట విరుద్దమంటూ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు కేజ్రీవాల్.
ఢిల్లీకి సీఎంలుగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ దగ్గరి నుంచి తన ముందు సీఎం షీలా దీక్షిత్ వరకు అందరూ పార్లమెంటరీ సెక్రటరీలను నియమించుకున్నవారేనని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం నియమించుకున్న పార్లమెంటరీ సెక్రటరీలకు ఒక్క రూపాయి కూడా అదనపు వేతనం ఇవ్వడం లేదని, కాబట్టి వాళ్ల పదవులకు అడ్డు పడవద్దని తెలిపారు.
తానేదైతే చెప్పాలనుకున్నారో.. అంతా చెప్పేశాక, మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు సీఎం కేజ్రీవాల్. ఇదిలా ఉంటే ఆప్ ప్రభుత్వం 21 మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించుకుంది. అయితే మంత్రి పదవితో సమాన హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రటరీ పదవులను అంతమందికి ఇవ్వడం చట్ట విరుద్దమంటూ అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ఆప్ కి కష్టాలు మొదలయ్యాయి.
దీంతో ఎలాగు చేతిలో మెజారిటీ ఉందని భావించిన సీఎం కేజ్రీవాల్, చట్ట సవరణలు చేసేందుకు సిద్దపడ్డారు. అయితే గవర్నర్ జంగ్ ఆప్ ప్రభుత్వ ప్రతిపాదనను తిప్పి పంపించడంతో వ్యవహారం బెడిసి కొట్టింది. దీంతో ఇక చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి అయినా ఆమోదిస్తారేమోనని ప్రయత్నించగా.. రాష్ట్రపతి ప్రణబ్ కూడా దాన్ని తిరస్కరించారు. ఇక చేసేదేం లేక తమ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించొద్దంటూ ప్రాధేయపడుతున్నారు కేజ్రీవాల్.