దారుణం: ఇంటికి తీసుకెళ్తామని, కారులో ఎక్కించుకుని కెన్యా మహిళపై గ్యాంగ్రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సమీపంలోని గుర్గావ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఓ కెన్యా దేశానికి చెందిన మహిళను ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. గురువారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్గావ్లోని బ్రిస్తోల్ చౌక్లో తాను నివాసం ఉండే దక్షిణ ఢిల్లీ ఛత్తపూర్కు వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న కెన్యాకు చెందిన మహిళను ముగ్గురు యువకులు స్కార్పియోలో వచ్చి ఛత్తపూర్లో దింపుతామని చెప్పి కారులో ఎక్కించుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.
ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు యువకులు వారి మరో ఇద్దరు స్నేహితులను కూడా పిలిపించుకున్నారు. మొత్తం ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను స్పృహకోల్పోయేలా కొట్టి అక్కడ్నుంచి పరారయ్యారు.
కొంతసేపటికి తేరుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్లో సుధీర్, మోహిత్, ప్రవీణ్ అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించామని, ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక తేల్చిందని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.