మరో దారుణం: ఆటోలో నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్రేప్
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే మరో దళిత నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన జరిగింది. వర్కాలలోని అయంతిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి పోలీసులు తెలిపారు. అయంతి బ్రిడ్జ్ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు.
బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19ఏళ్ల బాధితురాలు తన గమ్యస్థానం చేరుకునేందుకు తనకు తెలిసిన ఓ డ్రైవర్ ఆటోలో ఎక్కింది. ఆ తర్వాత అతని స్నేహితులిద్దరూ అదే ఆటోలో ఎక్కారు.
అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఆటో డ్రైవర్ తోపాటు మిగితా ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధిత యువతి పక్షవాతం రావడంతో అక్కడే ఉండిపోయింది.
ఏడ్చుకుంటూ సాయం కోసం కేకలు వేసింది. సమీపంలోని స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎర్నాకుళం జిల్లాలో దళిత లా విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే ఈ దారుణం చోటు చేసుకోవడం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.