ఘోరం: కుటుంబాన్ని చంపి, ఇంటివెనకాలే పాతిపెట్టారు, క్షుద్రపూజల ప్రభావమేనా?
తిరువనంతపురం: కేరళలోని ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
చంపి, పూడ్చిపెట్టారు
ఓ కుటుంబంలోని భార్యభర్తలు, వారి కూతురు, కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. వారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటి వెనుకే గొయ్యి తవ్వి నలుగురినీ ఒకరిపై ఒకరిని పెట్టి పూడ్చేశారు. ఇంట్లోని వ్యక్తులు రెండు మూడు రోజులుగా బయటకు రావడం లేదని గమనించిన పొరుగు వాళ్లు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రక్తపు మరకలు
ఈ నేపథ్యంలో పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడడంతో ఈ ఘోరం బయటపడింది. ఇంట్లో అక్కడక్కడా రక్తపు మరకలు ఉన్నాయి. ఇంటి వెనుకకు వెళ్లగా ఓ చోట గొయ్యి తవ్వి పూడ్చేసినట్లు కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో తవ్వగా నలుగురి మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను కె.కృష్ణన్(52), ఆయన భార్య సుశీల(50), కుమార్తె అర్ష(21), కుమారుడు అర్జున్(20)లుగా గుర్తించారు. వారి శరీరాలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కొట్టి చంపారు..
ఘటనా స్థలంలో కత్తి, సుత్తెను స్వాధీనం చేసుకున్నారు. సుత్తెతో బలంగా కొట్టడం వల్ల వాళ్లు చనిపోయినట్లు తెలుస్తోందని చెప్పారు. గత ఆదివారం వీరిని చంపి పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టానికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబానికి బాగా తెలిసిన వారే హత్యలకు పాల్పడి ఉంటారని, ఈ నేరంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
చేతబడే కారణమా?
కాగా, నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మరణం వెనుక చేతబడి కారణమా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లోని వాళ్లు ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడేవాళ్లు కాదని స్థానికులు పోలీసులకు చెప్పారు.
కుటుంబ మరణానికి అదే కారణమా?
కృష్ణన్కు రబ్బర్ ప్లాంట్ ఉందని, అయితే ఆయన జ్యోతిష్కుడు అని, తాంత్రిక పూజలు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రాత్రిపూట పెద్ద పెద్ద కార్లలో చాలా మంది కృష్ణన్ వద్దకు వస్తుంటారని కూడా ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు తెలిపారు. దీంతో చేతబడి చేశారనే అనుమానంతోనే ఎవరైనా కుటుంబం మొత్తాన్ని చంపేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని బురారీ ఘటనలో 11మంది కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం, జార్ఖండ్ లోనూ ఓ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి ఘటనలు మరువకముందే ఈ ఘటన జరగడం ఆందోళనకంగా మారింది.