సీఏఏ నిరసన: పెళ్లి మండపానికి ప్లకార్డుతో ఒంటెపై నవవరుడు!
తిరువనంతపురం: ఇప్పటికే కేరళ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ తేల్చి చెప్పింది. కేరళలోని చాలా ప్రజలు సీఏఏను వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా చేపట్టారు.
తాజాగా, ఓ నవవరుడు వినూత్నంగా సీఏఏకు వ్యతిరేక ప్రదర్శన నిర్వహించాడు. తాను పెళ్లి మండపానికి ఒంటెపై వెళుతున్న సమయంలో సీఏఏకు వ్యతిరేకిస్తూ ప్లకార్డులను ప్రదర్శించాడు. సీఏఏను తిరస్కరించండి.. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను బహిష్కరించండి అంటూ రాసివున్న ప్లకార్డును అతడు పట్టుకున్నాడు.
వజిముక్కులోని పెళ్లి మండపానికి వరుడు హజా హుస్సేన్ ఒంటెపై బయలుదేరాడు. అతని వెంట భారీ సంఖ్యలో కుటుంబసభ్యులు, బంధువులు వచ్చారు. సీఏఏకు తన వ్యతిరేకతను తెలియజేసేందుకే ఇలా చేశానని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. నవ వధువుకు తాను ఆభరణాలతోపాటు రాజ్యాంగం కాపీని కూడా అందజేసినట్లు తెలిపారు. సీఏఏను తిరస్కరించాల్సిందేనని వ్యాఖ్యానించాడు ఈ స్థానిక వ్యాపారవేత్త.
కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మొదట్నుంచి కూడా సీఏఏను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. సీఏఏను కేరళలో అమలు చేయబోమని కేంద్రానికి స్పష్టం చేశారు. అయితే, కేంద్రం పార్లమెంటులో చేసిన చట్టాలను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రం ఇప్పటికే తేల్చేసింది.. కేంద్రం ప్రకటన చేసినప్పటికీ.. కేరళతోపాటు పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కూడా సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. తెలంగాణ సర్కారు అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తుందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏను) దేశ వ్యాప్తంగా అమలు చేసి తీరుతామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మత వివక్ష, శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొని అక్కడ బతకలేని పరిస్థితిలో మనదేశానికి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలు(హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర మైనార్టీకి చెందినవారు)కు భారత పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. 2014కు ముందు భారతదేశంలోకి వచ్చిన ఈ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించనుంది.