దేశంలోనే యంగెస్ట్ మేయర్ ఆర్య రాజేంద్రన్: తిరువనంతపురంకు యువోత్సాహం, ఇక అప్గ్రేడ్
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంకు 21 ఏళ్ల యువ మేయర్ రాబోతున్నారు. ఆమే కాలేజీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్. అంతేగాక, ఆమే భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ కానుండటం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదవన్ముంగల్ నుంచి వార్డు కౌన్సిలర్గా ఆర్య రాజేంద్రన్ గెలుపొందారు.
Recommended Video
మేయర్ పదవి ఇలా వరించింది..
సీపీఎం జిల్లా సెక్రటరేటియర్ ఆమెను బరిలోకి దింపింది. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పోటీలో నిలిపిన పిన్న వయస్కురాలు ఆర్యనే కావడం గమనార్హం.తిరువనంతపురంలో ఎల్డీఎఫ్ గెలిచినప్పటికీ.. ఇద్దరు మేయర్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. దీంతో ఆర్యనే మేయర్ పదవి వరించింది.
ఆర్య రాజేంద్రన్ ఘన విజయం..
పార్టీ సీనియర్ నేత జమీల శ్రీధరన్ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో మేయర్ అవకాశాన్ని కోల్పోయారు. అయితే, అప్పటికే ఓ యువ నేతను మేయర్గా ఎన్నుకోవాలనే డిమాండ్లు వినిపిస్తుండటం.. ఆర్య రాజేంద్రన్ ఘన విజయం సాధించడంతో పార్టీ అధిష్టానం కూడా ఆమెవైపే మొగ్గుచూపింది.
ఆర్య రాజేంద్రన్ కాలేజీ విద్యార్థే కానీ..
తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆర్య రాజేంద్రన్ బ్యాచిలర్ స్టూడెంట్ కావడం గమనార్హం. రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే ఆర్య.. భారత విద్యార్థి ఫెడరేషన్లో సభ్యురాలు కూడా. సీపీఎం బాలల విభాగమైన కేరళ బాల సంఘం అధ్యక్షురాలిగా కూడా ఆర్య రాజేంద్రన్ వ్యవహరిస్తున్నారు.
ఆర్య రాజేంద్రన్ ఏమంటున్నారంటే..?
ఇక మేయర్ పదవి చేపట్టడంపై ఆర్య రాజేంద్రన్ పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను చేపట్టబోయే నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాననే నమ్మకం ఉందని తెలిపారు. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే ఈ బాధ్యతలను నిర్వహిస్తానని ఆమె చెప్పారు. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నానని, దిగువ ప్రాథమిక పాఠశాలలను అప్ గ్రేడ్ చేయడంపై దృష్టిసారిస్తానని ఆర్య రాజేంద్రన్ స్పష్టం చేశారు.
కాగా, సివిల్ బాడీ ఎన్నికల్లో ఆర్య అతి పిన్న వయస్కురాలు. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ఐదింటిలో విజయం సాధించింది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది.